Mission Bhagiratha | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గత కొన్నేండ్లుగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్న కేంద్రం.. తాజాగా మరోసారి ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్న రాష్ర్టాలు, కుటుంబాల సంఖ్యను శుక్రవారం మరోసారి వెల్లడించింది. దేశంలో మొత్తం 9 రాష్ర్టాలు ఇంటింటికీ నల్లా నీటిని అందించగా, వాటిలో 6 రాష్ర్టాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోని 100 శాతం కుటుంబాలకు శుద్ధిచేసిన తాగునీటిని నల్లా ద్వారా అందిస్తున్న రాష్ర్టాలు ఉన్నాయని తాజా నివేదికలో కేంద్రం ప్రకటించింది. మొదట 100 శాతం కుటుంబాలకు తాగునీటిని అందించిన రాష్ట్రం తెలంగాణేనని తెలిపింది. రాష్ట్రంలో 54 లక్షల కుటుంబాలకు శుద్ధిచేసిన నీటిని అందించారు.
‘మిషన్ భగీరథ’ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం శుద్ధిచేసిన గోదావరి, కృష్ణా నదీజలాలను అందించింది. నదీజలాలు ప్రజల ఆరోగ్యానికి అనువుగా ఉంటుందన్న నిపుణుల సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిషన్ భగీరథను అతి తక్కువ వ్యవధిలోనే పూర్తిచేసి యావత్తు దేశం దృష్టిని కేసీఆర్ ప్రభుత్వం ఆకర్షించింది. దాదాపు 13 రాష్ర్టాలు ఈ పథకాన్ని ప్రశంసించాయి. ఇక్కడికి వచ్చి అధ్యయనం చేశాయి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. గత పదేండ్లుగా రాష్ట్రంలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్రమే పార్లమెంట్లో ప్రకటించింది. మిషన్ భగీరథకు కేంద్రం నయా పైసా సాయం చేయకపోయినా గత ప్రభుత్వం పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా శుద్ధిచేసిన తాగునీరు అందుతున్నది. ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వెనుకబడ్డాయి. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదు.
100 శాతం లక్ష్యం చేరిన రాష్ర్టాలు
రాష్ట్రం ఇంటింటికీ నల్లా నీరు అందుతున్న కుటుంబాలు