CM KCR | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఓ ఉద్విగ్న దృశ్యం ఆవిష్కృతమైంది. మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమవీరుల కుటుంబాలను ఉద్యమ రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కున చేర్చుకొన్నారు. అమరజ్యోతి ప్రారంభ వేదిక సాక్షిగా వందలాది మంది అమరుల కుటుంబాల నుంచి ప్రతినిధులుగా ఆరుగురి కుటుంబాలను సీఎం కేసీఆర్ గౌరవించారు.
ఒక్కో అమరుడి కుటుంబానికి శాలువాలు కప్పుతున్న వేళ.. వారి త్యాగాలను మనసారా స్మరించుకొన్నారు. అమరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ, తమ్ముడు రవీంద్రచారికి సీఎం కేసీఆర్ శాలువా కప్పారు. అమరుడు పోలీసు కిష్టయ్య కుటుంబం నుంచి ఆయన భార్య పద్మావతి, కూతురు ప్రియాంక, కొడుకు రాహుల్ను గౌరవించారు. అమరుడు వేణుగోపాల్రెడ్డి కుటంబం నుంచి తల్లి లక్ష్మమ్మ, అన్న వెంకట్రామిరెడ్డి, మేనమామ సిద్ధారెడ్డికి, అమరుడు సిరిపురం యాదయ్య కుటుంబం నుంచి ఆయన వదిన లక్ష్మమ్మ, సోదరుడు మహేశ్కు, అమరుడు యాదిరెడ్డి కుటుంబం నుంచి తల్లి చంద్రమ్మ, సోదరుడు ఓంరెడ్డికి, కావలి సువర్ణ కుటుంబసభ్యులకు మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతికుమారితో శాలువాలు కప్పించారు. మొత్తంగా అమరజ్యోతి ప్రారంభ కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాల రాకతో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు పరిపూర్ణమయ్యాయి.