హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు టీఎస్ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఆర్డినరీ నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులకే అనుమతి ఉన్న కాంప్లిమెంటరీ బస్పాస్లను ఏసీ సర్వీస్లకూ వర్తింపజేస్తూ టీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల ఎండీ సజ్జనార్ను కలిసిన పోలీసు అమరవీరుల కుటుంబాలు.. ఏసీ బస్సుల్లోనూ కాంప్లిమెంటరీ పాస్లను అనుమతించాలని కోరారు. స్పందించిన సజ్జనార్ శుక్రవారం కొత్త కాంప్లిమెంటరీ బస్ పాసులను సంబంధిత వ్యక్తులకు అందజేశారు. సజ్జనార్ మాట్లాడుతూ పోలీస్ అమరుల సేవలకు గు ర్తింపుగా వారి కుటుంబీకులకు ఏసీ సర్వీసులలోనూ అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మార్గనిర్దేశనంలో ఆర్టీసీని ముందుకు తీసుకెళ్తున్నట్టు సజ్జనార్ పేర్కొన్నారు.