హైదరాబాద్, మే 9 ( నమస్తే తెలంగాణ ): బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీలో కలిసికట్టుగా ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రెండు పార్టీల వ్యవహారాలు తాజాగా తెరముందుకు వచ్చాయి. దేశం మెచ్చిన మిషన్ భగీరథ పథకంపై బురదజల్లేందుకు కాంగ్రెస్ యత్నిస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికీ ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథను రాజకీయంగా బద్నాం చేయాలని చూస్తున్నది. దేశంలోనే అత్యధిక ఇండ్లకు నల్లా నీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలువడంపై కండ్లు మండిన కాంగ్రెస్ కుట్రలకు దిగుతున్నది. మిషన్ భగీరథ పథకంలో అవకతవకలు జరిగాయని, గతంలో వేసిన పైప్లైన్ల ద్వారానే 60శాతం నీటిని అందిస్తున్నారని ఆరోపిస్తూ ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. సురక్షిత తాగునీటిని గడపగడపకూ అందించే లక్ష్యంతో చేపట్టిన పథకంపై నిరాధారంగా, అవగాహన లేమితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణపై విషం చిమ్మేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసికట్టుగా ఫిర్యాదుల డ్రామా ఆడుతున్నట్లు అర్థమవుతున్నది.
పైపులన్నీ కొత్తవే వేసినట్లు ఎక్కడా చెప్పని ప్రభుత్వం
మిషన్ భగీరథలో చేపట్టిన పనులన్నీ కొత్తవేనని రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ చెప్పలేదు. ఆదే సమయంలో గ్రామాల్లో ఉపయోగించుకోవడానికి అనువుగా ఉన్న, కాలవ్యవధి కలిగి ఉన్న పైపులైన్లను ఎక్కడా తొలగించలేదు. కాలవ్యవధి ముగిసిన పైపులను మాత్రమే తొలగించి వాటిస్థానంలో కొత్తవి వేశారు. పనికివచ్చే పాత పైపులను వృథాచేయకుండా వాడుకోవడంలోనూ రాష్ట్రప్రభుత్వం సమయస్ఫూర్తితో వ్యవహరించింది. దీని ఫలితంగా మిషన్ భగీరథ పనులకు ముందు వేసిన అంచనాల కంటే తక్కువగా ఖర్చు కావడం గమనార్హం. అయితే దీనిపై నిజానిజాలు తెలుసుకోకుండా.. ఢిల్లీలో గగ్గోలు పెట్టేందుకు కాంగ్రెస్ యత్నిస్తుండటం నవ్వుల పాలవుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మిషన్ భగీరథ ద్వారా వస్తున్న మంచి పేరును చూసి ఓర్వేలేకే కుట్రలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.