నిజామాబాద్ : దేవుని పేరు మీద రాజకీయాలు, తెలంగాణ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారిని తిప్పికొట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా
భీంగల్ మండలం సికింద్రపూర్ గ్రామంలో 8 కోట్ల 40 లక్షల వ్యయంతో నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ ను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేని రాజకీయ పార్టీలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో పని చేస్తున్నది ఎవరు..? మాటలు చెప్పేది ఎవరో ప్రజలు ఆలోచించాలని సూచించారు . బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఒక్క టన్ను నిల్వ చేసుకునే గోడౌన్ కూడా లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో నేడు 25 కోట్లతో 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం గల గోడౌన్లు నిర్మించుకున్నామని తెలిపారు. సీఎం విప్లవాత్మక నిర్ణయాల వల్ల సాగు విస్తీర్ణం,ధాన్యం ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని అన్నారు.
రైతు బంధు,రైతు బీమా,24గంటల ఉచిత విద్యుత్, సాగునీటి కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, సకాలంలో ఎరువుల పంపిణీపై ఇతర రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలను చూసి యావత్ దేశం కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటుందని అన్నారు. అనంతరం అధునాతన సౌకర్యాలతో నిర్మించిన గోదాంను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.