హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఓ నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాలో సభ్యులుగా ఉన్న చైతన్యపురిలోని ఎస్ఎల్ కన్సల్టెన్సీ నిర్వాహకురాలు శ్రీసాలా లక్ష్మీతోపాటు వడ్డే రోహిత్, వడ్లమూరి శ్రీనివాసరావు, గారేపల్లి సాయిప్రణయ్ని మంగళవారం అరెస్టు చేసినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల నుంచి 100కుపైగా నకిలీ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంప్లు, నాన్ జ్యుడీషియల్ స్టాంపులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నట్టు వివరించారు. హైదరాబాద్ కొత్తపేటలోని న్యూ మారుతీనగర్కు చెందిన విద్యార్థి జితేందర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేసినట్టు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఈ ముఠా గతంలో దాదాపు 20 మందికి ఫేక్ సర్టిఫికెట్లను ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇంటర్ పూర్తిచేసిన జితేందర్ ఉన్నత విద్య కోసం విదేశానికి వెళ్లేందుకు శ్రీసాలా లక్ష్మీని సంప్రదించినట్టు సీపీ తెలిపారు.
దీంతో ఆమె రూ.లక్ష ఖర్చవుతుందని చెప్పి.. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని సాహితి కాలేజీలో బీఎస్సీ పూర్తిచేసినట్టు అతనికి మార్క్స్ మెమో, కాన్వొకేషన్ సర్టిఫికెట్, గ్రాడ్యుయేషన్ డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు వివరించారు. ఈ సర్టిఫికెట్లపై జితేందర్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడని, వాస్తవానికి కాకతీయ వర్సిటీ పరిధిలో ‘సాహితి’ పేరుతో ఎలాంటి కాలేజీ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ముఠాల నుంచి నకిలీ సర్టిఫికెట్లు తీసుకొన్నవారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. నకిలీ సర్టిఫికెట్లు తీసుకొని విదేశాలకు వెళ్లినవారిలో ఇప్పటికే కొంతమంది అక్కడ పట్టుబడినట్టు సమాచారం ఉన్నదన్నారు. నకిలీ సర్టిఫికెట్ల ముఠాల గురించి ఎవరికైనా తెలిస్తే డయల్ 100 లేదా రాచకొండ వాట్పప్ నంబర్ 9490617111కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ముఠాను పట్టుకొన్న ఎస్వోటీ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్, చైతన్యపురి పోలీసులను సీపీ మహేశ్ భగత్ అభినందించారు. సమావేశంలో ఎస్వోటీ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.