వరంగల్ : దేశంలో గుర్తింపు పొందిన పలు యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠాను వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులంతా ఆరు కన్సల్టెన్సీ సంస్థలకు సంబంధించిన వారు కాగా, అందరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా దేశాలకు పంపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ ముఠా నుంచి పలు యూనివర్సిటీలకు సంబంధించిన 212 నకిలీ సర్టిఫికెట్లు, 6 ల్యాప్టాప్లు, ఒక ఐపాడ్, 2 ప్రింటర్లు, 5 సీపీయూలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్ బాటిల్స్, 1 లామినేషన్ మిషన్, 12 సెల్ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు దార అరుణ్. ఇతని స్వస్థలం మహబూబాబాద్.