హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కరెంట్ బిల్లుల చెల్లింపు పేరుతో వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్లను నమ్మొద్దని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన చేశారు. విద్యుత్తు బిల్లు పెండింగ్ ఉన్నదని, వెంటనే కట్టకపోతే రాత్రిపూట విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని కొందరికి ఫోన్లు వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు వివరాలు తీసుకొని వారి అకౌంట్ల నుంచి నగదు కాజేస్తున్నట్టు తెలిసిందని చెప్పారు. విద్యుత్తు బిల్లుల చెల్లింపు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను విద్యుత్తుశాఖ అడగదని, ఎటువంటి వెబ్లింక్లు పంపదని స్పష్టంచేశారు. బిల్లులు, ఇతర ఏమైనా సందేహాలు ఉంటే www. tssouthernpower.com, TSSPDCL మొబైల్ యాప్ను సంప్రదించాలని సూచించారు. కరెంట్ బిల్లుల కోసం ఎవరైనా ఫోన్లు చేసి బ్యాంకు వివరాలు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.