జగిత్యాల : ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగును సద్వినియోగం చేసుకుని కళ్లను సురక్షితంగా ఉంచుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రం బ్రాహ్మణ సంఘం లో గురువారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి సమస్యను తేలికగా తీసుకోవద్దని సూచించారు.
కంటి సమస్యను సామాజిక బాధ్యతగా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి కంటి వెలుగును ప్రారంభించారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు, కూలీలు, విద్యార్థులకు తెలవకుండానే సైట్ ఉంటుందని తెలిపారు. వారు పరీక్ష చేసుకునే లోగా అది కాస్తా పెరిగి ఇబ్బందులు ఏర్పడతాయని వెల్లడించారు. ఉచిత శిబిరాల ద్వారా కళ్లను కాపాడుకోవచ్చని సూచించారు.
మొదటి విడత కంటి వెలుగులో కోటి 54 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి వాళ్లకు కావాల్సిన మందులు అందించిందని గుర్తు చేశారు.రెండవ విడత కంటి వెలుగులో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో 34 బృందాల ద్వారా ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డు పరిధిలో కంటి వెలుగు శిబిరాలు ఉంటాయని అన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ లో పర్యావరణ సమతుల్యతను సంరక్షించేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ సంగి సత్తెమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, సౌళ్ల భీమన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేశ్, వైస్ చైర్మన్ సునీల్, అదనపు కలెక్టర్ మకరంద్, జిల్లా వైద్య అధికారి శ్రీధర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.