హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర గడ్డ మీద గులాబీ జెండా సరికొత్త చరిత్ర సృష్టించనున్నదా? బీఆర్ఎస్ విజయఢంకా మోగించనున్నదా? టీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలో తెలంగాణలో అప్రతిహత చరిత్రకు ‘స్థానిక’ జయకేతనం ఎగురవేసినట్టే మహారాష్ట్రలో ఎగురవేయనున్నదా? అంటే ఆదివారం నాందేడ్ వేదికగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన పొలికేక అవుననే సంకేతం ఇస్తున్నది. ‘వచ్చే ఏడేనిమిది రోజుల్లో ప్రతీ ఊరికి బీఆర్ఎస్ వాహనం వస్తుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించిన అన్ని రకాల కమిటీలు వేసుకుందాం. మనవాళ్లు వస్తరు. అవసరమైతే నేనూ అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతా’ అని కేసీఆర్ చేసిన ప్రకటన మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. అక్కడ రెండు మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆదివారం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర నలుమూలల నుంచి బీఆర్ఎస్లో చేరిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు (సర్పంచ్లు, జడ్పీటీసీలు) వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తారని అక్కడి రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. అదే నిజమైతే 2001లో తెలంగాణలో టీఆర్ఎస్ సృష్టించిన చరిత్ర, మహారాష్ట్రలో బీఆర్ఎస్ నవశకానికి నాంది పలుకుతున్నదనే వాదన బలంగా వినిపిస్తున్నది.
2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి గులాబీ జెండాను ఎగురవేశారు. తర్వాత నాలుగు నెలలకు (18 ఆగస్టు 2001)న టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ అయింది. వీటి మధ్యే తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. జూలై 12, 15, 17 తేదీల్లో జరిగిన స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీలు) ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులు విజయ పతాకాన్ని ఎగురవేశారు. (రైతునాగలి గుర్తుతో) వందల మంది ఎంపీటీసీ, 85 మంది జడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్నారు. 2001 ఆగస్టు 2 నుంచి 16 వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ రెండు వేల మంది సర్పంచ్ సీట్లు, 12 వేల వార్డు సభ్యులను టీఆర్ఎస్ గెలుచుకున్నది. కరీంనగర్, నిజామాబాద్ రెండు జిల్లా పరిషత్లపై గులాబీ జెండా ఎగిరింది. 2022 అక్టోబర్ 5న విజయదశమి నాడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఇలా రూపాంతరం చెందుతున్నట్టు పార్టీ తీర్మానం చేసిన నాలుగు నెలలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాందేడ్లో చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరాఠ్వాడలోనూ గులాబీ జెండా రెపరెపలాడుతుందని అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.