హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జనవరి 25న ప్రారంభమైనంది కంటివెలుగు శిబిరం శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీహెచ్ఎంవో వెంకట్ ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం డీజీపీ కార్యాలయంలోని 1,152 మంది పోలీసులు, సిబ్బందికి పరీక్షలు చేశారు.
వీరిలో 515 మందికి రీడింగ్ గ్లాసెస్ అందించగా, 326 మందికి ప్రిస్క్రిప్షన్ కండ్లద్దాలు అందించారు. ముగింపు కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు. తమ కార్యాలయంలో శిబిరాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఓపికతో పరీక్షలు చేసిన వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్, డీఐజీ రమేశ్రెడ్డి, డాక్టర్లు, ఆప్తమాలజిస్ట్లు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.