హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ సర్కారు చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. వంద రోజుల కార్యక్రమం అద్భుత ఫలితాలిస్తున్నది. ఇందులో ఇప్పటి వరకు 85% కంటి పరీక్షలు పూర్తి అయ్యాయి. శనివారం నాటికి 69 రోజుల పనిదినాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి 34 లక్షల 53 వేల 975 మందికి పరీక్షలు చేశారు. దృష్టి లోపమున్న వారిని గుర్తించి 19 లక్షల 95 వేల 659 మందికి ఉచితంగా కండ్లద్దాలు, మందులను అందజేశారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 63 లక్షల 18 వేల 637 మంది పురుషులు, 71 లక్షల 20 వేల 703 మంది స్త్రీలు, 7042 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 98 లక్షల 77 వేల 475 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. క్యాంపుల నిర్వహణను డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, కంటి వైద్యులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎలు, ఆశాలు, డీఈవోలు సహా, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.