బంజారాహిల్స్, ఫిబ్రవరి 21: ఆగ్నేయాసియా ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న కంటి సమస్యలను గుర్తించడంతోపాటు అంధత్వ నివారణకు సమగ్రమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్సింగ్ చెప్పారు. బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆడిటోరియంలో మంగళవారం ‘ఇంటిగ్రేటెడ్ పీపుల్-సెంటర్డ్ ఐ కేర్’ అంశంపై నిర్వహించిన డబ్ల్యూహెచ్వో సభ్యదేశాల ప్రతినిధుల సమావేశంలో ఆమె మా ట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపం, అంధత్వంతో జీవిస్తున్న 200 కోట్ల పైచిలుకు మందిలో దాదాపు 30 శాతం ఆగ్నేయాసియా ప్రాంతంలోనే ఉన్నారని తెలిపారు. వీరిలో దాదాపు సగానికిపైగా దృష్టిలోపాలు సరిచేయగలిగేవే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సదస్సులో చర్చిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎల్వీపీఈఐ పబ్లిక్ హెల్త్ నెట్వర్క్ డైరెక్టర్ రోహిత్ ఖన్నా, వ్యవస్థాపకుడు గుళ్లపల్లి ఎన్ రావు, ప్రతినిధులు పాల్గొన్నారు.