హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. సాయంత్రం నుంచి ఉదయం వరకు మంచుదుప్పటి కప్పేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు పొగమంచులోనే ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో 10-15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండ, ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. హైదరాబాద్లోనూ చలి తీవ్రత పెరుగుతున్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతానికి తమిళనాడు వైపు కదులుతున్నదని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.