‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు..’ అన్నట్టు పేగుబంధాలకు నిలువెల్లా సమాధికడుతున్నది నేటి సమాజం. రక్తసంబంధాలు వెన్నపోట్లు పొడుస్తుంటే.. స్నేహబంధాలు కడుపులో కత్తులు దించుతున్నాయి. వివాహేతర సంబంధాలు.. గుట్టుచప్పుడు కాకుండా గొంతునులిమేస్తున్నాయి.
ఎక్కడచూసినా పైసలే పరమావధిగా రక్తసంబంధాలు సైతం.. ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. మానవత్వాన్ని విడిచి అన్నదమ్ములను, అక్కాచెల్లెళ్లను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, ఆఖరికి ప్రాణంగా చూసుకునే స్నేహితులను, నమ్మివచ్చిన ప్రియురాళ్లను సైతం అంతమొందించేందుకు వెనుకాడటం లేదు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న హత్యల్లో ఆస్తివివాదాలు, వివాహేతర సంబంధాలదే అగ్రస్థానం.
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కేవలం 20 లక్షల రూపాయల విలువ చేసే రెండు చిన్న ఇండ్లు.. రూ.3 లక్షల అప్పు ఆరుగురి ప్రాణాలను బలిగొన్నది. ఆస్తి కోసమే ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు, వారిద్దరి మేనత్తలు, ఆ పిల్లల తల్లిదండ్రులు.. మొత్తంగా ఆరుగురిని అంతమొందించాడు కిరాతకుడైన ఓ స్నేహితుడు. నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించింది. ఇలాంటి ఉదాంతాలు దేశవ్యాప్తంగా నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా అయినవాళ్లే.. తమ వాళ్లను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. భూ వివాదాలు, ఆస్తిగొడవలతో రక్త సంబంధాలు రక్తసిక్తమవుతున్నాయి. 2022లో నమోదైన మర్డర్ కేసుల్లో అయినవాళ్ల పాత్రే అధికంగా ఉందని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. తుచ్ఛమైన ఆస్తుల కోసం మానవ సంబంధాలను మంటగల్పుతున్నారని, డబ్బుల కోసం కిరాతకంగా చంపేస్తున్నారని, మనుషుల్లో ఈ తరహా విపరీత ధోరణి బాగా పెరిగిపోయిందని సైకాలజిస్టులు సైతం ఆందోళన చెందుతున్నారు.
ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం.. 2022లో దేశవ్యాప్తంగా 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 9,662 హత్యలు పలు వివాదాల కారణంగా జరిగాయి. వీటిల్లో 3,761 హత్యలు వ్యక్తిగత కక్షల వల్లే జరిగాయంటే అతిశయోక్తి కాదు. మన తెలంగాణలో 2022లో వివిధ వివాదాల వల్ల 516 హత్యలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా భూ వివాదాల కారణంగా 2,326 హత్యలు నమోదు కాగా.. తెలంగాణలో 98 హత్యలు జరిగాయి. కేవలం కుటుంబ తగాదాలు, గెట్టు పంచాయితీలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఆస్తి గొడవల కారణంగా దేశవ్యాప్తంగా 3,134 హత్యలు నమోదు కాగా.. తెలంగాణలో 258 నమోదయ్యాయి. కొద్దిపాటి గొడవలు చిలికి చిలికి 3,294 హత్యలకు దారితీశాయి. ఈ తరహా హత్యలు తెలంగాణలో 134 నమోదయ్యాయి.
ప్రేమ, స్నేహం ముసుగులో అయితనవారే గొంతులుకోస్తున్నారు. 2022లో ప్రేమ వ్యవహారాల కారణంగా దేశవ్యాప్తంగా 1,401 హత్యలు జరిగితే.. తెలంగాణలో కేవలం 14 హత్యలు మాత్రమే నమోదయ్యాయి. ఇక వివాహేతర సంబంధాల కారణంగా 2022లో 1,420 హత్యలు నమోదు కాగా.. తెలంగాణలో 116 హత్యలు జరిగాయి. మొత్తంగా 2020లో 29,193 హత్యలు, 2021లో 29,272 హత్యలు, 2022లో 28,522 హత్యలు జరిగాయి. కాగా మన తెలంగాణలో 2020లో 802 హత్యలు, 2021లో 1026 హత్యలు, 2022లో 937 హత్యకేసులు నమోదయ్యాయి. అయితే, 2023 నవంబర్ 30 నాటికి మొత్తం 789 హత్య కేసులు నమోదైనట్టు సమాచారం. కాగా వీటిల్లో అత్యధికంగా కుటుంబ కలహాల వల్ల 176 హత్యలు నమోదైనట్టు సమాచారం.