Laxmi Baraz | హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) వద్ద పేలుడు సంభవించింది. శనివారం సాయంత్రం ఈ పేలుడు శబ్ధంతోపాటు మెరుపులు కూడా కనిపించడంతో సాగునీటి రంగ ఇంజినీర్లు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి నదిపై ఈ బరాజ్ ఉంది. మహారాష్ట్ర వైపు ఈ ఘటన జరగడం.. పేలుడు శబ్దం పెద్దగానే రావడతో ఏం జరిగిందోనన్న భయంతో అధికారులు కొద్దిసేపు వేచి చూశారు. అనంతరం అక్కడకు వెళ్లి చూడగా.. ఆరో బ్లాక్లోని 20వ ఫిల్లర్ స్వల్పంగా కుంగినట్లు గుర్తించారు. కానీ, అప్పటికే చీకటి పడటంతో పేలుడు ఎక్కడ జరిగింది? ఆ పరిసరాలు ఎలా ఉన్నాయి? అనేవి ఇంజినీర్లు స్పష్టంగా గుర్తించలేకపోయారు.
ప్రాథమికంగా చూసిన మేరకు మాత్రం ఫిల్లర్ స్వల్పంగా కుంగిపోయినట్లు కనిపించినందున ముందు జాగ్రత్త చర్యగా వెంటనే తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేశారు. సాంకేతికంగానూ మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు బరాజ్లోని నీటి నిల్వలను కూడా గేట్లు ఎత్తి దిగువకు వదిలేందుకు చర్యలు మొదలు పెట్టారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఈ బరాజ్ను ఈ ప్రాజెక్టు నిర్మాణాల్లో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి ఉన్న ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది.
16.17 టీఎంసీల పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యంతో 85 గేట్లు, 87 ఫిల్లర్లు ఉన్న ఈ బరాజ్ 2019లో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్లోనూ గోదావరికి వచ్చిన భారీ వరదలను సైతం ఈ బరాజ్ తట్టుకుని నిలబడింది. ప్రస్తుతం అలాంటి భారీ వరద కూడా లేదు. పైగా కేవలం 14,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే నమోదవుతుంది.
అంటే సాంకేతికంగా కాకుండా ఫిల్లర్ కుంగడానికి, శబ్ధం రావడానికి మధ్య సంబంధం ఉందని ఇంజినీర్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర వైపు అసాంఘిక శక్తుల సంచారం ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతున్న దరిమిలా కుట్ర కోణం కూడా ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే తెల్లారిన తర్వాత సమగ్రంగా పరిశీలిస్తే గానీ అసలు ఏం జరిగిందనే దానిపై కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోతామని ఇంజినీర్లు చెబుతున్నారు.
తాము ప్రాథమికంగా చూసిన పరిస్థితుల ప్రకారం ఏం జరిగినప్పటికీ… రెండు మూడు నెలల్లో సరిగ్గా ఈ బరాజ్పై రాకపోకలు పునరుద్ధరించవచ్చని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బరాజ్లో పది టీఎంసీల నీటి నిల్వ ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా గేట్లు ఎత్తి ఆ నీటిని దిగువకు వదులుతున్నారు.