హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూముల బదలాయింపు (నిరోధక) చట్టానికి సవరణలు చేయడానికి గల కారణాలను వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లో సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ను ఆదేశించింది. 1977 నాటి చట్టానికి సవరణ తెచ్చిన 12/2018ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏ ఆనంద్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రతివాదులుగా సీఎం కేసీఆర్ను, రాజకీయ పార్టీలను చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రతివాదుల జాబితా నుంచి వారిని తొలగించాలని బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్తో కూడిన ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.