హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్యశాఖ, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావు చెప్పారు. వరంగల్ మల్టీసూపర్ స్పెషాలిటీ దవాఖానసహా ఎనిమిది మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నూతన మెడికల్ కాలేజీల నిర్మాణ పురోగతిపై మంగళవారం బీఆర్కేభవన్లో ఆరోగ్య, ఆర్అండ్బీశాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలు త్వరగా అందుబాటులోకి వస్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీల నిర్మాణాలు ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. స్థలంవృథా కాకుండా, అన్ని వసతులతో నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పేద బిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్యసేవలు అందాలనే సీఎం కేసీఆర్ కలను సాకారం చేసేందుకు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పల్లె దవాఖానల ద్వారా గ్రామీణులకు ఎంబీబీఎస్ వైద్యుల సేవలు, మెడికల్ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతాయని అన్నారు. సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, సీఈ రాజేందర్, ప్రొఫెసర్ విమల థామస్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు.