హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్లో చేరేందుకు వివిధ రాష్ర్టాల నేతలు ముందుకొస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాగాలాండ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వై సులంతుంగ్ హెచ్ లోథా శనివారం హైదరాబాద్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి తన ఆసక్తిని వ్యక్తంచేశారు. త్వరలో జరుగనున్న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నాగాలాండ్లో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. లోథా 1980-81లో కోహిమా లోథా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, ఆల్ నాగాలాండ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. డెమోక్రటిక్ లేబర్ పార్టీని స్థాపించి 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం ఎన్సీపీలో కొనసాగుతున్నారు. నాగాలాండ్ ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలతోపాటు నేషనల్ కిసాన్ సెల్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సైతం హాజరైన ఆయన కేసీఆర్ నేతృత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. లోథా వెంట కొత్తగూడెం బీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ నాయకులు అనుదీప్, మోర భాసర్రావు తదితరులు ఉన్నారు.
కొప్పులకు ‘రూట్స్టెక్’ ఆహ్వానం
అమెరికాలోని నార్త్ టెంపుల్స్ట్రీట్ సాల్ట్లేక్ సిటీలో ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23న నిర్వహించనున్న రూట్స్టెక్-2023 ఎక్స్పోకు హాజరుకావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఆహ్వానం అందింది. ఇన్స్టిట్యూట్ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ ఆసియా చీఫ్ స్టీఫెన్ ఎల్ నికెల్ పంపించిన ఆహ్వాన పత్రికను సంస్థ ప్రతినిధులు సురేశ్ రామకృష్ణ, మేకల మనోహర్, శంకర్ లూక్ తదితరులు మంత్రికి అందజేశారు.