ఖైరతాబాద్, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ విజయ బావుటా ఎగురవేస్తుందని క్యూ మెగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ఖాదర్ ఖాన్ పఠాన్ సర్వే వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్కు 55 నుంచి 60 సీట్లు, కాంగ్రెస్ 45 నుంచి 50 సీట్లు వస్తాయని తెలిపారు. బీజేపీకి 2 నుంచి 5, ఎంఐఎంకు 5 నుంచి 7 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
ఓట్ షేర్ బీఆర్ఎస్కు 43 శాతం రావచ్చని అంచనా వేశారు. 30 ఏండ్ల లోపువారు 38 శాతం, 30 నుంచి 40 ఏండ్లవారు 40 శాతం, 40 నుంచి 50 ఏండ్ల వయస్సు గలవారు 48 శాతం, 50 నుంచి 60 ఏండ్లున్నవారు 50 శాతం, 60 ఏండ్లు పైబడ్డవారు 51 శాతం మంది బీఆర్ఎస్వైపు మొగ్గారని చెప్పారు. బీఆర్ఎస్ మూడోసారి విజయం సాధించి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని తెలిపారు. ప్రజలు సంక్షేమం వైపు మొగ్గు చూపారని, ప్రజా ప్రతినిధులకంటే పార్టీ, సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో ఓట్లు వేశారని చెప్పారు. 119 నియోజకవర్గాల్లో తమ బృందం 10,22,500 మంది నుంచి వివరాలు సేకరించి సర్వేను రూపొందించామని వెల్లడించారు.