హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): పాస్పోర్ట్ ధ్రువీకరణ ప్రక్రియలో ప్రతిభ కనబరుస్తూ, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నందుకు తెలంగాణ పోలీసులకు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతిష్టాత్మక ‘ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్’ను ప్రదానం చేసింది. దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ ధ్రువీకరణ సేవల్లో తెలంగాణ పోలీసుల విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించగా.. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చేతుల మీదుగా డీజీపీ సీవీ ఆనంద్ ఈ పురసారాన్ని శుక్రవారం అందుకున్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పాస్పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీస్ ధ్రువీకరణ అత్యంత కీలకమైన అంశమని, ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించడంలో తెలంగాణ పోలీసులు చూపుతున్న నిబద్ధతకు ఇది గుర్తింపు అని అభివర్ణించారు. ఈ అవార్డు తెలంగాణకు రావడం గర్వకారణమని పేరొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయడం, ప్రజా సేవలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. తెలంగాణ పోలీసులు 5 నుంచి 7 రోజుల్లోనే పాస్పోర్ట్ ధ్రువీకరణ పూర్తి చేస్తున్నారని, 2025-26లో 8,67,741 పాస్పోర్ట్ దరఖాస్తుల్లో ఇప్పటికే 8,67,452 (99%) దరఖాస్తుల ధ్రువీకరణను పూర్తి చేశారని చెప్పారు. అంతకుముందు 2024-25లో 8,06,684 పాస్పోర్ట్ దరఖాస్తులను సగటున ఏడు రోజులలోపే ధ్రువీకరించి దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరును ప్రదర్శించారని తెలిపారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా 2013-16 మధ్య కాలంలో పనిచేసిన ప్రస్తుత డీజీపీ సీవీ ఆనంద్ 2014లో పాస్పోర్ట్ ధ్రువీకరణ కోసం ప్రత్యేకంగా ‘వెరిఫాస్ట్’ అనే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. 2015లో ఈ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చారు. అప్పటినుంచి పాస్పోర్ట్ ధ్రువీకరణ సేవల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ తెలంగాణ పోలీసులకు ఏడు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఇది దేశంలోని అత్యుత్తమ పోలీస్ సంస్థలలో తెలంగాణ పోలీసులకు ప్రత్యేక స్థానం కల్పించింది.
తెలంగాణ పోలీసులు అభివృద్ధి చేసిన ‘వెరిఫాస్ట్’ వ్యవస్థ కృత్రిమ మేధస్సు, డాటా మ్యాచింగ్ సాంకేతికతల ఆధారంగా పనిచేస్తుంది. దీని ద్వారా దరఖాస్తుదారుల వివరాలను సీసీటీఎన్ఎస్, పూర్వపు పాస్పోర్ట్ రికార్డులు, ఇతర డేటాబేస్లతో సరిపోల్చి , నకిలీ దరఖాస్తులు, నేరచరిత్ర ఉన్న వ్యక్తులను త్వరితగతిన గుర్తించే అవకాశం కలుగుతున్నది.