హైదరాబాద్, జనవరి 28: చిన్నప్పుడు ఆకాశంలో చుక్కలను చూస్తూ అక్కడికి వెళ్తే ఎంత బాగుండు! అనుకొన్నారాయన. శూన్యంలో విహరించాలని తపించారు. అక్కడి నుంచి భూమండలం మొత్తాన్ని ఒకేసారి చూడాలని కలలు కన్నారు. దానికోసం కష్టపడి అనుకొన్నది సాధించారు.. తెలంగాణ బిడ్డ రాజా జాన్ వూర్పుటూర్ ‘గ్రైండర్’ చారి(రాజాచారి). స్పేస్ఎక్స్ క్రూ-3 వ్యోమనౌక కమాండర్గా అంతర్జాతీయ పరిశోధనాకేంద్రంలోకి అడుగుపెట్టారు. నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. భూమికి దాదాపు 500 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు 28వేల కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఐఎస్ఎస్ నుంచి ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘చిన్నపుడు చుక్కలతో ఆడుకోవాలనిపించేది. గాల్లో తేలాలనిపించేది. ఇప్పుడు ఆ కలను నిజం చేసుకొన్నా. ప్రతి రోజు సూర్యోదయాలను, సూర్యాస్తమయాలను చూస్తున్నా. అత్యద్భుతంగా ఉన్న ఇక్కడి నక్షత్ర కాంతులు అబ్బురపరుస్తున్నాయి. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం అపురూపంగా కనిపిస్తున్నది. భూమి చుట్టూ ప్రతి 90 నిమిషాలకోసారి తిరుగుతున్నా. ఇక్కడే ఆర్నెల్లపాటు ఉంటాను. ఇక్కడికి రావటం, భూమ్మీద ఉన్న ప్రజల కోసం వివిధ పరిశోధనలు చేయటం గొప్ప గౌరవం. అంతరిక్షంలో మొక్కల పెంపకంపై పరిశోధన చేస్తున్నాం. దీనికోసం వివిధ రకాల సాగు పద్ధతులను పరిశీలిస్తున్నాం. పత్తి మూల కణాలపైనా పరిశోధన చేస్తున్నాం. ఈ ఆర్నెల్ల కాలంలో 300 పరిశోధనలు చేపట్టునున్నాం. గురుత్వాకర్షణ లేని ప్రాంతంలో ఉండటం వల్ల మా శరీరాలపై మానసిక, శారీరక ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితులకు అలవాటు పడేందుకు కాస్త సమయం పడుతుంది. అయితే, ఈ పరిస్థితులను మనసారా ఆస్వాదిస్తున్నా. నా కుటుంబంతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండేందుకు నాసా గొప్పగా సహకారం అందిస్తున్నది. ప్రతి రోజు ఫోన్లో మాట్లాడ్డానికి వీలు కల్పించింది. ముగ్గురు పిల్లల తండ్రిగా, వాళ్లతో ఇక్కడి విశేషాలను పంచుకొంటున్నాను. ఈ అనుభూతి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. 2023లో ప్రయోగానికి ఇస్రో కూడా ప్రణాళికలు రచిస్తున్నది. భారత యువత కూడా సమీప భవిష్యత్తులో మంచి, మరిన్ని అవకాశాలు దక్కించుకొంటారని ఆశిస్తున్నా. మీకు దేనిపై అభిరుచి ఉంటుందో దానికోసం తీవ్రంగా ప్రయత్నించండి’ అని సంతోషంగా రాజాచారి అక్కడి విశేషాలను పంచుకొన్నారు.
రాజాచారి తాత స్వస్థలం మహబూబ్నగర్. ఉస్మానియా యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. తండ్రి శ్రీనివాసాచారి ఓయూలోనే ఇంజినీరింగ్ చదివి, ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రాజాచారి మొత్తం మూడు సార్లు హైదరాబాద్ను సందర్శించారు. ఆయన బంధువులు ఇక్కడే ఉన్నారు. ‘చిన్నప్పుడు వేసవిలో ట్యాంక్బండ్ వద్దకు వెళ్లి, బంధువుల పిల్లలతో కలిసి ఆడుకొనేవాడిని. అక్కడ తినుబండారాలనూ రుచి చూశా. తెలుగు నేర్చుకొనేందుకు చాలా ప్రయత్నించా, కానీ ప్రస్తుతం ఏదీ గుర్తులేదు’ అని వెల్లడించారు.