హైదరాబాద్ జనవరి 17 (నమస్తే తెలంగాణ): ‘బీజేపీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలయ్యింది. ఓ వైపు అప్పులు, నిరుద్యోగం దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. అన్నింటా ధరలు పెరిగి సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్ర,రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు తగ్గుతున్నాయి. అనుకూలంగా ఉన్న రాష్ర్టాలకు ఒకలా, కేంద్రాన్ని వ్యతిరేకించే రాష్ర్టాలను మరోలా చూస్తున్నారు. పాలకులకు ఈ వైఖరి తగదు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం రావాలి. అది తెలంగాణ సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం. బీఆర్ఆస్తో దేశరాజకీయాలు మారబోతున్నాయి. కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నేత. ఆయనతోనే తెలుగు రాష్ర్టాలతోపాటు దేశ సమస్యలు పరిష్కారమవుతాయి. సీఎం కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడు. ఇంట గెలిచిన ఆయన రచ్చ కూడా గెలుస్తారు’ అన్నారు ఏపీలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ వీసీ ఎం ముత్యాలనాయుడు. బీఆర్ఎస్ ఆవిర్భావం, ఖమ్మం సభ, దేశ రాజకీయాలపై ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ జాతీయస్థాయిలో కచ్చితంగా రాణిస్తుంది. తెలంగాణ చుట్టుపక్కల రాష్ర్టాలకు ఈ విషయం ఎప్పుడో అర్థమైంది. జాతీయస్థాయిలో బీజేపీకి దీటుగా సమాధానమిచ్చే సమర్థనేత అవసరం. కేసీఆర్ నమ్మదగిన వ్యక్తి. జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి తేడా ఆయనకు స్పష్టంగా తెలుసు. తెలుగు రాష్ర్టాల ఆస్తుల పంపకాలు, జలవివాదాలు, బకాయిలపై ఆయనకొక స్పష్టత ఉన్నది. అందుకే ఏపీ ప్రజలు బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు. ఏపీ నాయకులతోనే..ప్రజలతో కాదు ఏపీ రాజకీయ నాయకులతోనే మా వైరం. అక్కడి ప్రజలతో కాదని సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇరు రాష్ర్టాల అభివృద్ధిపై ఆయనకు స్పష్టత ఉన్నది. ఏపీలో 3 రాజధానుల వ్యవహారం నలుగుతున్నది. తెలంగాణలో నూతన సచివాలయం నిర్మాణం చురుగ్గా సాగుతున్నది. కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు అందుబాటులోకి వస్తున్నాయి.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి బతికుంటే..కేసీఆర్ను నెత్తిన పెట్టుకొనేవారు. తెలంగాణ అభివృద్ధి అవుతదా? అన్న ప్రశ్నల నుంచి, ఇదిగో తెలంగాణ అభివృద్ధి అని దేశానికి మాడల్గా నిలిపారు.
‘దళితబంధు’తో తెలంగాణలో దళితబిడ్డలు ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. దేశంలో కొన్నిచోట్ల దళితులపై అరాచకాలు, హత్యలు జరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం దళిత బిడ్డలు అన్ని కులాలతో సమానంగా వ్యాపారం, వ్యవసాయం చేసుకొంటున్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదు..అందరివాడని చెప్పేందుకు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు. 120 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
కేసీఆర్ గొప్ప దార్శనికుడు. 20 ఏండ్ల ముందుచూపు ఉన్నవారు. అందుకే తెలంగాణ సస్యశ్యామలంగా ఉన్నది. గతంలో తెలంగాణలో ఎక్కడ చూసినా బీడు భూములే ఉండేవి. ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. కాళేశ్వరంతో నీళ్లను ఎత్తిపోసి తెలంగాణను సుభిక్షంగా ఉంచడమనేది గొప్ప యజ్ఞం. ఏపీలో పోలవరం ఇంకా పూర్తికాలేదు. ఎక్కడాలేని విధంగా రైతులకు ప్రభుత్వమే పెట్టుబడి ఇవ్వడం గొప్ప విషయం.