బెంగళూరు, నమస్తే తెలంగాణ ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ దక్షిణాదిలో నూతన రాజకీయ సమీకరణలకు నాంది కానున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. జనతాదళ్-ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి ఆయా రాష్ట్రాలకు పరిమితమైన రాజకీయ పక్షాలైనప్పటికీ భావసారూప్యత కలిగిన అంశాల్లో కలసి పోరాడేందుకు, కేంద్రంపై వత్తిడి పెంచేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ భేటీ జేడీఎస్ శ్రేణుల్లో ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంత కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. రెండు పక్షాల మధ్య చిరకాలం మైత్రీబంధం నెలకొనాలని ఆ ప్రాంతానికి చెందిన మాజీ శాసనసభ్యుడు ఒకరు అభిలషించగా, కాంగ్రెస్, భాజపా నేతలు స్పందించలేదు.
దీని గురించి వారిని ప్రశ్నించగా, వేచి చూద్దామనే భావనను వ్యక్తం చేశారు. కర్ణాటక, తెలంగాణలో ఈ రెండు పక్షాలే ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్, కర్ణాటకలో జేడీఎస్ పాత మైసూరు, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లోనే ప్రభావశీలంగా ఉంది. అయితే రైతునేతగా మాజీ ప్రధాని దేవేగౌడకు రాష్ట్రమంతటా ఇప్పటికీ పేరు, పలుకుబడి ఉన్నాయి. దాన్ని పూర్తిగా ఎన్నికల రాజకీయాలకు పరివర్తన చేసేందుకు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి కృషి చేస్తున్న దశలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ కావడం కలసి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల కుమారస్వామి ఆసక్తి కనబరుస్తున్నారు.
తన తండ్రి దేవేగౌడ సూచన మేరకే కేసీఆర్ను కలుసున్న కుమారస్వామి, తమ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తానని పలుమార్లు ఇప్పటికే ప్రకటించారు. రైతు సమస్యలపై కర్ణాటకలోనూ పోరాటానికి సమాయత్తమైనట్టు వెల్లడించారు. ముఖ్యంగా కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంసరణల ముసాయిదాకు వ్యతిరేకంగా చట్టసభల్లో జేడీఎస్ శ్రేణులు గళాన్ని విప్పనున్నాయి. రెండు పక్షాల మధ్య మైత్రి కొనసాగితే సరిహద్దు జిల్లాల్లో, మరీ ముఖ్యంగా నియోజకవర్గాల్లో రెండు పక్షాలకూ రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య సామాజిక, సాంస్కృతిక, భౌగోళిక సారూప్యతలు, ప్రజల మధ్య బంధుత్వాలు ఉన్నా యి.
ఇవి రాజకీయ ప్రయోజనాల సాధనకు వేదిక అవుతాయనటంలో సందేహం లేదు. బీదరు, గుల్బర్గ, రాయచూరు, యాద్గిర్ జిల్లావాసులకు హైదరాబాద్, తెలంగాణకు చెందిన పొరుగు జిల్లాలతోనే అనుబంధం ఎకువ. వ్యాపారాలు, వైద్యం తదితరాలకు హైదరాబాద్కే రాకపోకలు సాగిస్తారు. ఆ సంగతి అలా ఉంచితే, ‘కేసీఆర్తో భేటీ ఆంతర్యం జాతీయ రాజకీయాలను కొత్త మలుపు తిప్పడమే. జాతీయ పట్టించుకోని రైతు, కార్మిక, పేదల సమస్యల పరిషారానికి గళాన్ని విప్పటమే ధ్యేయం. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటే లక్ష్యం. 2023 శాసనసభ ఎన్నికలు, విజయదశమి పండుగ వేళకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఆవిషారానికి ప్రాధాన్యం ఇచ్చే దిశలో మా చర్చలు సాగాయ’ని కుమారస్వామి చెప్పడం గమనార్హం.