హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు త్వరలోనే శుభవార్తలు వింటారని, ఐఆర్, పీఆర్సీ సహా ఈహెచ్ఎస్పై కీలక ప్రకటనలుంటాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వీటి పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లో ఉద్యోగుల జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలతో పలు అంశాలపై చర్చించారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను కలిసిన సందర్భంలో పీఆర్సీ, ఐఆర్ గురించి విన్నవించగా సానుకూలంగా స్పందించి, శాసనసభావేదికగా ప్రకటించారని, ఆగస్టు 15న గోల్కొండ కోటలోనూ ఇదే విషయాన్ని వెల్లడించినట్టు మంత్రి గుర్తుచేశారు.
ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ వీ మమత మాట్లాడుతూ.. త్వరలోనే సీఎం కేసీఆర్ను కలిసి అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఉద్యోగుల సేవలను అసెంబ్లీ వేదికగా గుర్తుచేసి ఈహెచ్ఎస్, ఐఆర్, పీఆర్సీలపై ప్రకటించనందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ వెన్నంటి ఉంటామని, బాసటగా నిలుస్తామని ఈ సందర్భంగా తీర్మానించారు. సమావేశంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, కృష్ణాయాదవ్, వెంకట్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.