మహబూబ్నగర్ అర్బన్, సెప్టెంబర్ 13 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విజయం తమదేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరనున్నదని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత ప్రతిపక్ష నాయకులు భూతద్ధం పెట్టి వెతికినా కనిపించరని అన్నారు. కేవలం ఎన్నికల వేళ మాత్రమే టూరిస్టుల్లా వచ్చిపోతారని ఆరోపించారు. ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని, బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పదేండ్లుగా ప్రజలకు ఏ ఆపదవచ్చినా ఆదుకుంటున్నామని అన్నా రు. అనంతరం మహబూబ్నగర్ రూరల్ మండలం ఫత్తేపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 50 మంది నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.