మహబూబ్నగర్ అర్బన్, సెప్టెంబర్ 9: బీఆర్ఎస్ కృషితోనే రాష్ట్రంలో కులవృత్తులకు సమున్నత గౌరవం దక్కిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్బెల్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఏకలవ్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కోల్పోయి.. కనుమరుగవుతున్న కులవృత్తులకు.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ జీవం పోశారని తెలిపారు. వ్యవసాయ పనిముట్లు తయారు చేసి ఎరుకల కులస్థులు నాగరికతను పరిచయం చేశారని, 1956లోనే తెలంగాణప్రదేశ్ ఎరుకల సంఘాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఎరుకల సంఘం నాయకుడు సత్యనారాయణకు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు కులం పేరుతో వృత్తులను అవమానిస్తున్నారని, ఇది మంచిది కాదని హితవు చెప్పారు. అనంతరం పిల్లలమర్రి రోడ్డులో రూ.8 లక్షలతో నిర్మించిన ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీని ప్రారంభించారు.