హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎక్సైజ్ శాఖ ఈ నెల 1 నుంచి 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా 123 కేసులు నమోదు చేసి, 151 మందిని అరెస్టు చేసినట్టు ఎక్సైజ్ ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం 988 కేజీల గంజాయి, 29 గంజాయి మొక్కలు, 20 గ్రాముల ఎండీఎంఏ, 8 ఎల్ఎస్డీ బ్లాట్స్, 56 గ్రాముల చరాస్, 210 గ్రాముల పప్పీ స్ట్రా, 12.56 కేజీల గంజాయి కలిసిన చాక్లెట్స్, 1.74 కేజీల అల్ప్రజోలం, 24 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 శాశ్వత ఎక్సైజ్ చెక్పోస్టులు ఏర్పాటుచేయగా ఏపీ సరిహద్దులో ఎనిమిది, మహారాష్ట్ర సరిహద్దులో ఎనిమిది, కర్ణాటక సరిహద్దులో నాలుగు, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఒక చెక్పోస్టు ఉన్నాయి. అన్ని చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించారు. ఆయా రాష్ర్టాల నుంచి అక్రమంగా మద్యం, కల్తీ సారా, గంజాయి వంటి డ్రగ్స్ రాష్ట్రంలోకి రాకుండా ఆయా చెక్పోస్టుల ద్వారా 24 గంటలూ తనిఖీలు చేపడుతున్నారు.