హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఇక నుంచి ఏటా రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్, డిసెంబర్ మాసాల్లో తప్పనిసరిగా టెట్ జరిగేలా నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే ఆమోదం తెలిపారు. అయితే, డీఎస్సీ నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తారు. ప్రస్తుతం టెట్ నిర్వహణకు 90 రోజుల సమయం పట్టనుండగా, అంతకుముందే నోటిఫికేషన్ను విడుదల చేస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎస్సీటీఈ) గతంలోనే ఏటా రెండుసార్లు ఏటా నిర్వహించాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. అంతే కాకుండా టెట్ గడువును 7 ఏండ్ల నుంచి జీవితకాలానికి పొడిగించింది. గతంలో టెట్లో అర్హతసాధించిన వారు .. స్కోర్ పెంచుకోవాలనుకొనే వారు..కొత్తగా బీఈడీ, డీఐఈడీ వంటి కోర్సులను పూర్తిచేసిన వారు మాత్రమే టెట్ రాసేవారు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు పేపర్ -2లో క్వాలిఫై కావాలన్న నిబంధన ఉన్నది. దీంతో టీచర్లు కూడా టెట్కు పోటీపడనున్నారు. దీంతో టెట్కు హాజరయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. పదోన్నతులు పొందే వారికి ఎక్కువసార్లు టెట్ రాసుకొనే వెసులుబాటు కలగనున్నది.