TS TET 2024 | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే ఫీజుల పెంపుతో అభ్యర్థుల నడ్డివిరిచిన సర్కారు.. నోటిఫికేషన్లో నార్మలైజేషన్పై స్పష్టత ఇవ్వకపోవడం మరో వివాదానికి కారణమైంది. టెట్లో నార్మలైజేషన్ ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు అభ్యర్థులను పట్టిపీడిస్తున్నాయి. టెట్ నోటిఫికేషన్లో నార్మలైజేషన్పై విద్యాశాఖ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.
టెట్ను తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించబోతున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు 15 రోజులపాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో సెషన్లో 30 -35 వేల మందికి మాత్రమే పరీక్షను నిర్వహించే వీలుంది. ఒకే సబ్జెక్టుకు రెండు, మూడు సెషన్లల్లో పరీక్షలు నిర్వహించే అవకాశముంది. ఒక పేపర్ ఈజీగా.. లేదా మధ్యస్తంగా.. మరో పేపర్ కఠినంగా వస్తే ఆయా సెషన్లో పరీక్షకు హాజరైన వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.
సులభంగా ప్రశ్నలొచ్చిన వారికి లాభం జరగగా, కఠినంగా వచ్చినవారికి నష్టం కలిగే అవకాశమున్నది. ఇంతటి కీలకమైన విషయంపై విద్యాశాఖ స్పష్టతనివ్వకపోగా, ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించడం గమనార్హం. గతంలో టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించడం వల్ల అభ్యర్థులందరికీ ఒకే ప్రశ్నపత్రాన్నిచ్చేవారు. పేపర్ల మూల్యాకంనంలో ఇబ్బందులొచ్చేవి కాదు. కానీప్పుడు ఆన్లైన్లో నిర్వహించడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిని సంప్రదించగా.. ఇప్పటి వరకు నార్మలైజేషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
అన్నింటా అమలు..
ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలన్నింటిలోనూ నార్మలైజేషన్ విధానం అమవుతున్నది. మరి ఇలాంటప్పుడు టెట్కెందుకు లేదన్న ప్రశ్నలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. జాతీయంగా నిర్వహించే జేఈఈ మొదలుకొని.. టీఎస్పీఎస్సీ, గురుకుల నియామక పరీక్షలన్నింటిలో నార్మలైజేషన్ను అమలుచేస్తున్నారు. ఇటీవల ఏపీ టెట్లోను ఈ విధానాన్ని అనుసరించారు. నార్మలైజేషన్లో భాగంగా సులభంగా వచ్చిన పేపర్లను, కఠినంగా వచ్చిన పేపర్లను అంచనావేసి సరాసరి మార్కులేస్తారు. ఈ విధానంలో సులభంగా వచ్చిన వారికి కొన్ని మార్కులు కోత విధించి, కఠినంగా వచ్చిన వారికి కొన్ని మార్కులు కలుపుతారు. ఇది ప్రశ్నల తీరును బట్టి.. సబ్జెక్టు నిపుణుల విచక్షణ మేరకే జరుగుతుంది.
డీఎస్సీలోనైనా ఉండేనా..?
టెట్ పరిస్థితి ఇలా ఉండగా కీలకమైన టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయిన డీఎస్సీలోనైనా నార్మలైజేషన్ ఉంటుందా.. ఉండదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. డీఎస్సీ పరీక్షలను సైతం ఈ సారి కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తున్నారు. దీంట్లోను నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ, దీనిపైనా విద్యాశాఖ స్పష్టతనివ్వలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని, అటు. టెట్కు.. ఇటు డీఎస్సీలో నార్మలైజేషన్ అమలుపై స్పష్టతనివ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.
టెట్ ఫీజుపై అభ్యర్థుల కన్నెర్ర
టెట్ ఫీజులను అడ్డగోలుగా పెంచడంపై అభ్యర్థులు కన్నెర్రజేశారు. అనాలోచితంగా 150-300 శాతం ఫీజులను పెంచడంపై మండిపడ్డారు. రూ.400 ఉన్న టెట్ ఫీజులను వెయ్యి.. రెండు వేలకు పెంచడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. భారీగా తరలివచ్చిన బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఎదుట ధర్నాను నిర్వహించారు. కరీంనగర్లోనూ ఉపాధ్యాయ ఉద్యోగార్థులు, టెట్ అభ్యర్థులు ఆందోళనకు దిగి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించారు. వనపర్తిలోని సురవరం ప్రతాపరెడ్డి స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదుట అభ్యర్థులు ధర్నా చేశారు. పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
టెట్ ఫీజు తగ్గించాలి
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు ఫీజు పెంపుతో పేద, మధ్యతరగతి అభ్యర్థులపై అధిక భారం పడుతుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో టెట్ ఒక పేపర్కు దరఖాస్తు ఫీజు రూ.200, రెండు పేపర్లకు రూ.300 ఫీజుగా నిర్ణయించామని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పేపర్1కు రూ.1,000, రెండు పేపర్ల ఫీజును రూ.2,000 పెంచడం సరికాదని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్రెడ్డికి బాల్కసుమన్ లేఖ రాశారు. కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్ పరీక్ష ఉంటుందని ప్రకటించారని, దీనివల్ల మిగతా జిల్లాల అభ్యర్థులకు దూరభారంతోపాటు ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొంటారని తెలిపారు. మొత్తం 33 జిల్లాల్లోనూ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏడు లక్షల మంది నిరుద్యోగుల సమస్యను పరిగణనలోకి పెంచిన టెట్ పరీక్ష ఫీజులను తగ్గించాలని కోరారు.