కరీంనగర్ : స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కాలనే సకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ అన్నారు. పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతామని తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ ఫౌండేషన్ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్ను వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, డెయిరీ చైర్మన్ రాజేశ్వర్ రావు కలిసి సందర్శించారు. గత నాలుగేండ్ల నుంచి తన సొంత ఖర్చులతో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడ దాదాపు 150 మంది నిరుద్యోగ యువతి యువకులకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో వినోద్ కుమార్ ప్రతిమ ఫౌండేషన్ స్టడీ సర్కిల్ను సందర్శించి విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు.
ఈ సంధర్బంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ… నిరుద్యోగ యువతీయువకులు కష్టపడి చదివి ప్రభుత్వ కొలువులు సాధించాలన్నారు. నైపుణ్యం కలిగిన టీచర్లతో కోచింగ్ ఇస్తున్నామని, అవసరమైన స్టడీ మెటిరీయల్ను కూడా అందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి ఉచిత కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకొని, ఉద్యోగం సాధించి, అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి ఫైరవీలకు తావు ఉండకూడదనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఇంటర్వ్యూ ను తొలగించడం జరిగిందన్నారు. ప్రతిభను నమ్మకొని మంచి మార్కులు సాధించిన వారికే ఉద్యోగ అవకాశం కలిగేలా వెసులుబాటు కల్పించారని తెలిపారు.