Vinod Kumar | కరీంనగర్ : ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో గంగాధర మండలం మధురానగర్ వీఏఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో కలిసి వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు ఉండదని, ఆ తీగలపై ఇక బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుందని ఉమ్మడి రాష్ట్రంలోని ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గంగాధరలో నేడు కరెంటు తీగలు ఉన్నాయి.. అందులో కరెంటు ఉంది.. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి తీగలపై బట్టలు ఆరేయాలని వినోద్ కుమార్ సూచించారు.
తెలంగాణ వచ్చిన కొత్తలో 775 యూనిట్ల కరెంటు ఉత్పత్తి మాత్రమే అయ్యేదని గుర్తు చేశారు. నేడు 18 వేల మెగావాట్లకు పైగా కరెంటు ఉత్పత్తి అవుతోంది. మరి రానున్న రోజుల్లో మరో 7 వేల మెగావాట్లతో కలిపి 25 వేల మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది అని వినోద్ కుమార్ తెలిపారు.
తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్రంలో 200 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవని వినోద్ కుమార్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడం కోసం వెయ్యి గురుకుల పాఠశాలలను సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవడానికి రూ. 25 లక్షల స్కాలర్షిప్ను ప్రభుత్వం అందిస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.