హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర నిధుల విడుదల విషయంలో వివక్షత చూపుతున్నారని, కేవలం గుజరాత్ రాష్ట్రానికే నిధుల మంజూరు విషయంలో పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం నిధులను విరివిగా విడుదల చేయడం ఏంటి? అని ప్రధానిని వినోద్ కుమార్ సూటిగా ప్రశ్నించారు.
ఒక్క గుజరాత్ రాష్ట్రానికే 9 నెలల కాలంలో రూ. ఒక లక్షా 37 వేల 655 కోట్ల (రూ. 1,37,655 కోట్లు) విలువైన ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇతర పనులకు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేశారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని నిధుల వరదను పారించారని తెలిపారు.
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోదీ దాదాపు 40 సార్లు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించి.. నిధులను మంజూరు చేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు నిధులను మంజూరు చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వివక్షతను చూపుతున్నారని వినోద్ కుమార్ అన్నారు. ప్రధాన మంత్రి హోదాలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడాల్సిన బాధ్యతను నరేంద్ర మోదీ విస్మరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం అయినా.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలైనా.. ప్రజలు ఓటు వేస్తేనే అధికార పగ్గాలు చేపడతాయని, అలాంటప్పుడు ప్రజా ప్రభుత్వాలైన ఇతర రాష్ట్రాలను ఎలా విస్మరిస్తారని వినోద్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకపక్ష విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ధీటైన జవాబు చెప్తారని వినోద్ కుమార్ అన్నారు.