గోదావరిఖని, మార్చి 21: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ బీజేపీలో విభేదాలు తార స్థాయికి చేరాయి. ‘బీ’ థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని విస్తరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్హరి సోమవారం రామగుండంలో నిర్వహించిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మంగళవారం గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడుతూ కౌశిక్ హరిపై ఎదురు దాడి చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సోమారపు వర్గీయులు గోదావరిఖని పట్టణంలో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు.
సోమవారం నాడే రామగుండంలో బీజేపీ రాష్ట్ర నేత కౌశిక్ హరి ఆధ్వర్యంలో రామగుండం ‘బీ’ థర్మల్ విద్యుత్తు కేంద్రం విస్తరణ చేసి ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ దీక్ష చేపట్టారు. ఇక్కడ కౌశిక్హరి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సహకారంతో దాదాపు 2 వేల మందిని హైదరాబాద్కు తీసుకువెళ్లి ‘బీ’ థర్మల్ విద్యుత్తు కేంద్రం విస్తరణ చేయాలని కోరితే అప్పటి సీఎం వెంటనే స్పందించి రూ.7,920 కోట్లతో ‘బీ’ థర్మల్ కేంద్రాన్ని విస్తరించడానికి అంగీకరించారని గుర్తుచేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సోమారపు సత్యనారాయణ అసమర్థత వల్ల ఇక్కడ ప్రారంభం కావాల్సిన విద్యుత్తు కేంద్రం యాదాద్రికి తరలిపోయిందని విమర్శించారు. దీనిపై సోమారపు సత్యనారాయణ స్పందించి మంగళవారం గోదావరిఖనిలోని పార్టీ కార్యాలయంలో హడావిడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
సాంకేతిక అంశాలు అనుకూలించని కారణంగానే ఇక్కడ ఏర్పాటు ‘బీ’ థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు కాలేదన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ బీజేపీ క్రమశిక్షణను ఉల్లంఘించిన కౌశిక్హరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇద్దరు నాయకులు బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో రామగుండంలో ఇబ్బందుల పాలవుతున్న బీజేపీలో ఇద్దరు ముఖ్య నాయకులు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని చర్చించుకుంటున్నారు.
రామగుండం నియోజకవర్గంలోని ఇద్దరు బీజేపీ నాయకులు కౌశిక్హరి, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీ నియమ, నిబంధనలకు విరుద్ధంగా వారి సొంత ఎజెండాలతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ పార్టీని ప్రజల్లో చులకన చేస్తున్నారని బీజేపీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు గుండబోయిన లక్ష్మణ్యాదవ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర పార్టీల నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మలు దహనం చేసినా, ప్రధాని మోదీని అవమానించిన సందర్భంలోనూ ఆ ఇద్దరు నాయకులు ఏ నాడూ స్పందించలేదని తెలిఆపరు. వారికి పార్టీలు మారే ఉద్దేశం ఉంటే వెళ్లిపోవాలని సూచించారు. సోమారపు సత్యనారాయణ పూర్తిగా పార్టీని బ్లాక్మెయిల్ చేస్తూ కుటుంబ పార్టీగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని తన సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా భావిస్తూ, తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తేనే ఉంటానన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన సదరు ఇద్దరు నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన అధిష్ఠానాన్ని కోరారు.