యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దమ్ముంటే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన యాదగిరిగుట్ట పట్టణంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ నిరుపేదలకు అనుకూలంగా ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడాలేవని తెలిపారు. తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, దళితబంధు, మిషన్ భగీరథ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంపన్నులకే కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. కొంతమంది పెట్టుబడిదారులకు రూ.10 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను కేంద్రం మాఫీ చేసిందని దుయ్యబట్టారు.