Dasyam Vinay Bhasker | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆటో కార్మికులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ భరోసా ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడ కనపడితే అక్కడ నిలదీయాలి అని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన కాంగ్రెస్ బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆటో డ్రైవర్లకు అందజేశారు. హనుమకొండలోని కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున ఈ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ బాకీ కార్డుతో పాటు, ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలుకు నోచుకోకపోవడంతో కాంగ్రెస్ ఆటో అన్నలకు బాకీ కార్డును ప్రత్యేకంగా తయారు చేసి ఈ రోజు ఆటో డ్రైవర్లకు అందించడం జరిగింది. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సుతో ఆటో కార్మికుల పొట్టకొట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులను ఎక్కడపడితే అక్కడ నిలదీయాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలతో గద్దెనెక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ 14 ఏళ్ల పాటు తెలంగాణ అంతట తిరిగి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని తెలంగాణను సాధించి పదేళ్లపాటు సంక్షేమం, అభివృద్ధితో కూడిన పాలన అందించారని, దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసిందని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా విద్యా,ఉద్యోగ, ఉపాధి రంగాలలో ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి సాధించిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ఎన్నికల సమయంలో క్యారెంటీ కార్డు అని, ఆరు గ్యారెంటీలు అని, 420 హామీలతో పేరుతో గద్దెనెక్కినదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చి… ఏ వర్గం ప్రజలను కూడా న్యాయం చేయలేదని అన్నారు. ఏ వర్గాలకైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ వర్గం ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అడిగితే బీఆర్ఎస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అనేక కేసులు పెడుతూ చిత్రహింసలకు గురి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు కేసులు కొత్త కాదని, కేసులకు భయపడేది లేదన్నారు.
కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో ములాఖత్ అయి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దెబ్బతీస్తుందన్నారు. గ్యారెంటీలలో ఆటో కార్మికులకు నెలకు రూ.1000, వితంతువులకు రూ. 2500, వికలాంగులకు రూ.6000, విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని మభ్యపెట్టి, గద్దెనకినటువంటి ప్రభుత్వం వాటిని 22 నెలలు అయినా అమలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల బతుకులను చిందర వందర చేసిందని అన్నారు. అనేక మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని అన్నారు. పాలన అంతా కూడా రివర్స్ గేర్లో జరుగుతుందని, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఆటో కార్మికుని కాపాడుకుంటారని అన్నారు. కేసులకు భయపడేది లేదని కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే అన్ని హామీలు నెరవేర్చాలని దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.