మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 17: అధికార కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి మహబూబ్నగర్లో సోషల్ మీడియా సమన్వయకర్త ఆశాప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు.
ఆరు గ్యాంరెటీలు అంటూ సీఎం రేవంత్ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా సాగిందని, కాంగ్రెస్ వచ్చాక ప్రణాళికాలోపంతో పంటలను ఎండబెట్టిందని మండిపడ్డారు. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే రేవంత్ సర్కారు చేష్టలుడిగి చూస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్మీడియా వేదికగా ప్రజలకు తెలియజేయాలని కోరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్రెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే.. ఒక్క మంత్రి గానీ, ఎమ్మెల్యేగానీ రైతుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారెంటీల పేరుతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్కు ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని సూచించారు.