Niranjan Reddy | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్లుగా నటిస్తూ.. రాష్ట్రంలో మాత్రం పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. కాళేశ్వరం విషయంలో ఆగమేఘాలపై స్పందించిన కేంద్రం.. ఎస్ఎల్బీసీ ఘటన విషయంలో మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన బీఆర్ఎస్ నేతలు దేవి ప్రసాద్, కిశోర్గౌడ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజలను పక్కదో పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ కమీషన్లు, కేసుల పేరుతో కుట్రకు తెరలేపిందని ధ్వజమెత్తారు.
కల్పతరువులాంటి కాళేశ్వరం కూలిపోయిందని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీలాంటి విఫల ప్రాజెక్టును చేపట్టి కాంగ్రెస్ ఎనిమిది మంది ప్రాణా బలితీసుకుందని మండిపడ్డారు. ఇప్పుడు సహాయక చర్యలు నిలిపివేసి చేతులెత్తేసిందని విమర్శించారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉన్నారు. టీబీఎం డిజైన్కు మూడేళ్లు పడుతుందని.. రెండేళ్లలోనే ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా మాటలు కట్టిపెట్టి ఇచ్చిన వాగ్ధానాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇటీవల ఏపీ పర్యటనలో కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ కంటే పది రేట్లు ఏపీకి నిధులు ఇచ్చామని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించడమేనన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులు సైతం రేవంత్ సర్కారుకు వంతపాడుతున్నారని మండిపడ్డారు.