Satyavathi Rathod | మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి భాష ఉందని.. ముఖ్యమంత్రి అనే సోయి ఆయనకు లేదని మండిపడ్డారు.ఇందిరమ్మ రాజ్యం అంటూ మహిళలను అగౌరవపర్చే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడిన సత్యవతి రాథోడ్.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఎన్ని హామీలు ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 హామీలు ఉన్నాయన వివరించారు.
మహాలక్ష్మీ పథకం కిందనే మూడు హామీలు ఉన్నాయని సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు. 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ 40 లక్షల మందికి మాత్రమే వర్తిస్తుందని.. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులకు ఈ స్కీం వర్తింపజేయాలని అన్నారు. గ్యాస్ కనెక్షన్లు కేవలం మహిళల పేరు మీద ఉంటేనే సబ్సిడీ వస్తుందని ప్రభుత్వం చెప్తోందని.. గ్యాస్ కనెక్షన్లు పురుషుల పేరు మీద ఉన్నా సబ్సిడీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం బోగస్ పథకంగా మారిందని ఆమె ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సులను నడపాలని సత్యవతి రాథోడ్ కోరారు. మహిళలకు సరిపడా బస్సులను ప్రభుత్వం నడపాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల చట్టబద్ధత ఏమైందని నిలదీశారు. పింఛన్లు 4,000 ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని ఆరోపించారు. గుడ్డిగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు వందల కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి పరుష పదజాలం మానుకోవాలని సత్యవతి రాథోడ్ హితవు పలికారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే రేవంత్ రెడ్డి ఎజెండాగా ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీటును టచ్ చేసే వాళ్లు పక్కనే ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో ఉన్నారని అన్నారు. తాను జైలుకు వెళ్లానని అందరిని జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని విమర్శించారు.
దళితులు, గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 100 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇచ్చిందని సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది 100 యూనిట్లేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన ఉద్యోగ నియామక పత్రాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవే అని గుర్తుచేశారు. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారని ప్రశ్నించారు. రైతులకు ఇస్తామన్న బోనస్ ఏమైందని నిలదీశారు. మేడిగడ్డను రిపేర్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని అన్నారు.