అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా.. కేసీఆర్ను ఎలా వెన్నుపోటు పొడవాలా? అని ఎదురుచూసిన వ్యక్తి ఈటల రాజేందర్ అని మాజీమంత్రి ఇనుగాలి పెద్దిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “నాలుగుసార్లు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అవకాశం ఇచ్చినా.. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పట్టకుండా.. అవకాశం ఇచ్చిన వారిపైనే కక్షకట్టిన దుర్మార్గుడు ఈటల. హుజూరాబాద్ అభివృద్ధి పట్టకుండా నిత్యం వ్యాపారాలు, సెటిల్మెంట్లతో బీజీగా ఉన్న ఈటల.. ఎప్పుడూ టీఆర్ఎస్ అభివృద్ధికి కృషి చేయలేదని అన్నారు.
ఏ నాయకుడైనా ప్రజా సమస్యలు పరిష్కారం కోరుతూ పదవులకు రాజీనామా చేస్తాడు. మరీ ఈయన ఏ సమస్య కోసం రాజీనామా చేశాడు? ఆస్తులు ఎక్కువై, సంపాదన పెరిగిపోయి దానిని కాపాడుకోవాలనే దురుద్దేశంతోనే రాజీనామా చేసి, బీజేపీ జపం చేస్తున్నాడు. అభివృద్ధి అంటే ఏమిటో రెండు నెలల్లో మంత్రి హరీష్ రావు చేసి చూపించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీని కాదని, ఎంతో ప్రోత్సహించిన సీఎం కేసీఆర్కు గోరీ కడతామని అవాకులు, చెవాకులు పేలుకుతున్నాడు. హుజూరాబాద్ను అభివృద్ధి చేయని అసమర్ధుడు ఈటల రాజేందర్. అతనికి ఓట్లు వేస్తే అభివృద్ధికి మరింత దూరం అవుతుంది హుజూరాబాద్. మనం బాగుపడాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకోవాలి” అని కోరారు.