Niranjan Reddy | హైదరాబాద్ : ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ గత పదేండ్ల స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుందని మాజీ మంత్రి తెలిపారు. గత పదేండ్లలో ఆర్థిక విధ్వంసం కాదు.. ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చామని అన్నారు. అప్పుల పేరుతో పథకాల నుంచి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. అది గవర్నర్ ప్రసంగమా ? ఎన్నికల ముందు కాంగ్రెస్ మాట్లాడిన ప్రచార మాటలా ? కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా? అంటూ ధ్వజమెత్తారు.
మొత్తం గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ 10 సంవత్సరాలలో తిరోగమనంలో ఉందన్నట్లు చెప్పారని, అదే నిజమైతే మరి కేంద్ర ప్రభుత్వ నివేదికలు, RBI, NITI Aayog report, UNOలాంటి ఇతర ప్రతిష్టాత్మక సంస్థలు ఇచ్చిన ఆవార్డులు, గుర్తింపులు దాచేస్తే దాగవని అన్నారు. తెలంగాణలో పండుతున్న పంటలు సత్యం, వస్తున్న కరంటు సత్యం, పారుతున్న నీళ్లు సత్యం, పెరిగిన తలసరి ఆదాయం సత్యం, జరిగిన హైదరాబాద్ అభివృద్ధి సత్యం, గ్రామాలలో స్వచ్ఛత సత్యం, పట్టణాల సుందరీకరణ సత్యం, SOTR లో తెలంగాణ దేశానికి తలమానికంగా ఉన్నది అన్నది సత్యం, ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి సత్యం అంటూ తీవ్ర స్థాయిలో గవర్నర్ ప్రసంగంపై మండిపడ్డారు.
అబద్ధాలు చెప్పడం వలన అభాసు పాలు కావడం తప్ప ఏమీ ఉండదని అన్నారు. తొమ్మిదిన్నరేండ్ల పాలన మీద బురద చల్లే కంటే 6 గ్యారంటీల అమలు మీద కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ వహిస్తే మంచిదని నిరంజన్ రెడ్డి అన్నారు. విద్యుత్ శాఖలో రూ.86 వేల కోట్ల అప్పులను చూపడం హస్యాస్పదమని అన్నారు. పదేండ్లలో ఉచిత విద్యుత్ కోసం రూ.42 వేల కోట్లు, రూ.26 వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్, 6 నుంచి 25 కు పెరిగిన 400 కేవీ సబ్ స్టేషన్లు, 51 నుంచి 103కు పెరిగిన 220 కేవీ సబ్ స్టేషన్లు, 176 నుంచి 250కి పెరిగిన 132 కేవీ సబ్ స్టేషన్లు, 2138 నుంచి 3250కి పెరిగిన 33/11 కేవీ సబ్ స్టేషన్లు దాచేస్తే దాగని సత్యాలని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 7778 మెగావాట్లు ఉన్న విద్యుత్ స్థాపిత సామర్ద్యం 2023 మే నాటికి 18,567 మెగావాట్లకు పెంచుకున్న విషయం నిజం కాదా ? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి అత్యంత తక్కువగా రుణాలు తీసుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అవునా ? కాదా ? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు మాని ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయకున్నా నష్టం మాత్రం చేయకుంటే చాలని అన్నారు.