Niranjan Reddy | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంగుష్టమాత్రుడితో.. అపర భగీరథుడు కేసీఆర్కు పోలికేంది..? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజం. ఇద్దరే ఎంపీలు ఉన్న బీజేపీ నుండి ప్రధానమంత్రిగా మోడీ మూడో సారి అయ్యాడు. గెలిచే పార్టీలో చేరి సీఎం అయ్యారు.. రేపు మీరు ఆ పార్టీలో ఉంటారో, పోతారో తెలియదు. ప్రతి దానికి కేసీఆర్ రావాలని అనడం ఏంటి.. వీధి పోరాటం ఏమైనా చేస్తారా..? మీరు ప్రజలకు ఏం చేస్తారో..? ఏం ధీమా ఇస్తారో..? చెప్పాలి అని డిమాండ్ చేశారు.
ఏ బేసిన్ ఎక్కడుందో తెలియదు..? దేవాదుల ఎక్కడుందో తెలియదు.. మరి కేసీఆర్ వచ్చి మీకు ఏం చెప్పాలి. తెలంగాణ ప్రాజెక్టులు, కేంద్రం తీరుపై నిండు శాసనసభలో కేసీఆర్ సమూలంగా వివరించారు.. అప్పుడు నీవున్న పార్టీ సభ నుండి పారిపోయింది. మీరు లేవనెత్తే అంశాలకు శాసనసభలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు లేదా గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డిలు సమాధానం ఇస్తారు.. వారు చెప్పే అంశాలకు ప్రజలు కన్విన్స్ అవుతారో లేదో చూద్దాం. మీరు ఎన్ని గంటలు మాట్లాడతారో.. దమ్ముంటే వీళ్లకు కూడా అంతే సమయం మైక్ కట్ చేయకుండా ఇవ్వండి అని చెప్పారు.
ఎస్ఎల్బీసీ కూలి ఎనిమిది మంది మరణించారు.. వారి శవాలను బయటకు తేలేకపోయారు అయినా మీకు సిగ్గు లేదు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో కేవలం రెండు పిల్లర్లు కుంగితే వాటిని బాగు చేయకుండా కాళేశ్వరం కూలేశ్వరం అని అంటారా ? కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయం అని చెబితే రాష్ట్రంలో బడి పిల్లలకు కూడా అర్ధం అయింది కానీ.. రేవంత్ రెడ్డికి అర్ధం కాకుంటే మేము ఏం చేస్తాం..? తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదు అని అనేకమార్లు చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశాడు.. మరి ఇఫ్పుడు ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి..? కేంద్రం ఎందుకు వివక్ష చూపుతుంది.. అకారం కోసం ఆంధ్రప్రదేశ్కు అనుమతులు ఇస్తారా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి హైడ్రాలజీ అనుమతి తప్ప అన్నీ ఉన్నాయి.. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవని కేంద్రం డీపీఆర్ వెనక్కు పంపింది.. మరి సీఎం ఏం చేస్తున్నాడు..? అని నిరంజన్ రెడ్డి నిలదీశారు.
విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏ ప్రాజెక్టు కట్టినా అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనుమతి తీసుకోవాలని చెప్పింది.. కానీ అసలు సమావేశమే ఏర్పాటు చేయకుండా రూ.82 వేల కోట్లతో గోదావరి బనకచర్లకు అనుమతులు ఎందుకు? కేంద్రం ఆ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం వెనక అసలు వ్యవహారం కేంద్రంలో చంద్రబాబు మద్దతు ఇవ్వడమే కారణం కాదా? బనకచర్ల ప్రాజెక్టును కేంద్రం తిరస్కరించాలి.. దానికి ఎలాంటి అనుమతులు కేంద్రం ఇవ్వకూడదు. దానికి ఎలాంటి అనుమతులు వచ్చినా తెలంగాణకు శాశ్వత ప్రమాదం తప్పదు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులను అడ్డుకోవాలి. కేసీఆర్ మీద, కాళేశ్వరం మీద మాట్లాడడం మానేసి బనకచర్ల అనుమతుల మీద కేంద్రంతో పోరాడాలి. ఒక్కసారైనా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని సీఎం, మంత్రులు పూర్తిగా పరిశీలించారా ? అసలు నీళ్లు ఎలా పారుతాయో వీరికి తెలుసా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలలో 90 శాతం పనులు పూర్తయ్యాయి.. కనీసం పది శాతం పనులు పూర్తి చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు.. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ ఎందుకు పూర్తి చేయడం లేదు. ఈ ప్రభుత్వం చివరిదశలో నీళ్లిచ్చి కేసీఆర్ పెండింగ్ పెడితే మేము పూర్తి చేశాం అని చెప్పుకునే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రి చనిపోతే దినవారాలకు నీళ్లు లేవని శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు రికార్డులలో ఉన్నాయి.. ఆ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీనే.. అప్పుడు రేవంత్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కాంగ్రెస్ పార్టీ నీళ్లు ఇచ్చింది కేవలం 13 వేల ఎకరాలకే.. కేసీఆర్ హయాంలో దానిని 4 లక్షల ఎకరాలకు పైగా సాగునీళ్లు ఇచ్చాం.. కల్వకుర్తి ఎత్తిపోతలకు రూ.5789 కోట్లు ఖర్చయ్యాయి.. అందులో రూ.4 వేల కోట్లు కేసీఆర్ హయాంలోనే ఖర్చయ్యాయి. పైసలు ఖర్చు చేసిన ప్రతిసారీ కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అభాండాలు మోపలేదు.. సీఎం స్థానంలో ఉంటూ నిత్యం కేసీఆర్ను ఆడిపోసుకోవడం శోచనీయం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమంలో కేసీఆర్ తనను నిత్యం దూషించిన వారిని కూడా అక్కున చేర్చుకున్నారు.. అది నిజమైన నేతల లక్షణం అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇది దండగమారి ప్రభుత్వం. సంబరాలు చేయాలా ? వద్దా ? వారే నిర్ణయించుకోవాలి. 70 లక్షల మంది రైతులకు సచివాలయం సాక్షిగా రైతుభరోసా వేశామని చెప్పారు. ఇంతకు ముందు ఒకసారి అరకొర, రెండు సార్లు ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకోవాలా? వరి ధాన్యానికి రూ.500 బోనస్ అరకొరగా వేసి అందరికీ వేశామని భ్రమలు కల్పించినందుకు సంబరాలా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం గుట్టలకు, రాళ్లకు రైతుబంధు ఇచ్చామని ప్రచారం చేశారు.. దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పారు. ఆ తర్వాత మంత్రి తుమ్మల రూ.25 వేల కోట్లు అనర్హులకు అందాయని చెప్పారు… వాటన్నింటినీ సరి చేశాకే రైతుభరోసా ఇస్తామని కాలయాపన చేయడానికి చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకే రైతుబంధు ఇచ్చింది.. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకే రైతుభరోసా వేశారు.. ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో రైతుభరోసా వేశారు అని నిరంజన్ రెడ్డి తెలిపారు.
రంగారెడ్డి జిల్లా రైతులు కూరగాయలు పండించకుంటే హైదరాబాద్ నగరంలో ప్రజలకు కూరగాయలు దొరకవని రేవంత్ రెడ్డి అన్నాడు… ఇప్పుడు అదే రంగారెడ్డి జిల్లా రైతులకు రైతుభరోసా ఎగ్గొట్టడంతో వారు ఆందోళన చేస్తున్నారు. స్థానిక ఎన్నికల తర్వాత కూడా రైతుభరోసా తప్పకుండా అమలు చేస్తామని, ఇది ఎన్నికల స్టంట్ కాదని సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ప్రజలకు, రైతులకు స్పష్టం చేయాలి. ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని ఎత్తేస్థారని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది.. ఈ పథకాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పాలి. రైతుబంధు కేసీఆర్ గారి మానసపుత్రిక .. సంక్షోభంలో ఉన్న, విధ్వంసం అయిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని, రైతుల జీవితాలను బాగు చేయాలన్న ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. రైతుబంధు పథకంతో తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారిపోయింది అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.