Jagadish Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతుందని.. ఈ సమయం తక్కువేం కాదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మార్పు తెస్తామని ప్రజలకు చెబితే.. అవకాశం ఇచ్చారని.. ఈ మార్పు తిరోగమనంలా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలు ఇవాళ తెలంగాణ ప్రజలు కోల్పోతున్నారన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో నీళ్లు లేక ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కేసీఆర్పై నమ్మకంతో అత్యధికంగా యాసంగి పంట వేశారని.. కాంగ్రెస్ పార్టీ రావడంతోనే కరువు వచ్చిందన్నారు.
నాగార్జున సాగర్లో 510 అడుగుల నీరున్నా రైతులకు బీఆర్ఎస్ హయాంలో నీరు ఇచ్చామన్నారు. ప్రస్తుతం సాగర్లో నీళ్లున్నా ప్రభుత్వానికి రైతులకు నీళ్లివ్వ చేతకావడం లేదని మండిపడ్డారు. కర్ణాటకలో నీళ్లున్నా.. ప్రభుత్వం కాంగ్రెస్సే ఉన్నా అడగడం చేతకావడం లేదన్నారు. మానవ బాంబులు అయితం.. పేగులు మెడలో వేసుకుంటాం అంటూ ఏం భాష రేవంత్రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. ఇవాళ రైతులు పేగులు నీ మెడలో వేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇవాళ వ్యవసాయరంగంపై సమీక్ష లేదని.. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇవాళ కాళేశ్వరంలో 400 క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కరువు కనపడడం లేదని.. బీఆర్ఎస్ శంకుస్థాపనలు చేసిన పనులు మొదలుపెట్టుకుంటూ.. 90 రోజుల్లో అది చేశాం.. ఇది చేశామనీ గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కొట్టుకొని పోవాలని చూస్తున్నారని.. బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నీటి పారుదలపై సమీక్ష చేయాలని.. రైతాంగానికి ఏం భరోసా ఇస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మాని.. కరువు పర్యటన చేయాలన్నారు. గుత్తా అమిత్రెడ్డిని ఎవరూ అడ్డుకోవడం లేదని.. ఆయనే ప్రకటన చేసుకున్నాడన్నారు. ఆయనే అడ్డుకుంటున్నారని చెప్తున్నారని.. రెండు రోజుల్లో నల్లగొండ , భువనగిరి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.