Jagadish Reddy | దేశంలో అప్పుల్లేని రాష్ట్రాలు ఉన్నాయా? అని మాజీ విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చి 25రోజులపైనే అవుతుందన్నారు. పథకాలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచూస్తుంటే.. అప్పులు అప్పులు అని పాడిందే పాట పాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెడితే తాము సమాధానం చెప్పామన్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం, విద్యుత్ మంత్రి జిల్లా పర్యటనలో అవే అప్పులు గురించి చెబుతున్నారన్నారు. తాము ప్రతీది అంకెలతో సహా తేటతెల్లంగా చెప్పామన్నారు.
కరెంటు రంగంలో తాము సాధించిన ప్రగతిని ఇప్పటికే వివరించామని, అప్పులేని రాష్ట్రాలు దేశంలో ఉన్నాయా? అని నిలదీశారు. దేశానికి కూడా అప్పు ఉందని గుర్తు చేశారు. మొన్నటి దాకా కాంగ్రెస్ ఏలిన రాజస్థాన్లో రూ.89వేలకోట్ల అప్పుల్లో విద్యుత్ సంస్థలు ఉన్నాయన్నారు. ప్రతిపక్షంలో మా అప్పుల గురించి చెప్పారని.. ఇప్పుడు అదే చెబుతున్నారన్నారు. దేశంలో విద్యుత్ సంస్థలు అన్నీ అప్పులు, నష్టాల్లోనే ఉన్నాయన్నారు. అప్పు చేశామో.. ఏం చేశామో ప్రజలకు తాము కష్టాలు లేకుండా చేశామన్నారు. పాలన చేతకాక కాంగ్రెస్ నేతలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నారన్నారు. మేనేజ్మెంట్ చేతకాక అప్పుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
2014 విద్యుత్ రంగంలో కాంగ్రెస్ మిగిల్చిన అప్పు రూ.22వేల కోట్లు అని.. అయినా 3గంటలు కరెంటు ఇవ్వలేకపోయారన్నారు. అదే అప్పు ఇప్పుడు నాలుగు రెట్లు అయ్యిందన్నారు. తాము అప్పు తెచ్చినా కరెంటు ఇచ్చామన్నారు. అప్పుల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అప్పు సాధారణ విషయం.. చేత కాక పాడిందే పాడుతున్నారని విమర్శించారు. అప్పు తీర్చడం చేతకాకపోతే అప్పు తెచ్చిన సంస్థలకే విద్యుత్ సంస్థలను అప్పగించాలని.. వాడే నడుపుతారన్నారు. ఇంకెన్ని రోజులూ కాంగ్రెస్ నేతలు అబద్ధాలతో బతుకు వెళ్లదీస్తారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు సబ్ క్రిటికల్ టెక్నాలజీ గురించి భట్టి పదేపదే మాట్లాడుతున్నారని.. సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఇప్పటికీ కూడా 30కి పైగా విద్యుత్ ప్రాజెక్టులు నడుస్తున్నాయన్నారు.
చట్టంలోనే తర్వాత సబ్ క్రిటికల్ టెక్నాలజీని మార్చుకోవచ్చని ఉందని, తాము ఫాలో అయ్యామన్నారు. గతంలో ఇదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పామన్నారు. భట్టి లేని సమస్యను పెద్దదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. లంకె బిందెల గురించి సీఎం మాట్లాడుతున్నారని.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారం పోయింది.. లంకె బిందెలు అప్పజెప్పి పోయారా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా లేని లోటును ప్రజలు అప్పుడే చర్చించుకుంటున్నారన్నారు. ప్రజాపాలన దరఖాస్తులో అకౌంట్ నంబర్ ఇవ్వాలని ఎందుకు అడగలేదని ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు.
నిన్న మేడిగడ్డలో మంత్రులు మంత్రుల్లాగా కాదు రౌడీల్లా మాట్లాడారని మండిపడ్డారు. వారి తీరు అసెంబ్లీలో అలాగే ఉందని.. బయట అలాగే ఉందన్నారు. విద్యుత్ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దిన ప్రభాకర్రావును అసెంబ్లీలో దుర్భాషలాడారని.. సభలో లేని వ్యక్తి పై నిందలు వేశారన్నారు. మేడిగడ్డలో కూడా మంత్రులు ఇంజినీర్లపై అమర్యాదగా ప్రశ్నించారని ఆరోపించారు. సీఎం, మంత్రులు చిల్లరగా మాట్లాడుతున్నారని,
తాము నిజాయతీని నిరూపించుకునేందుకు ఇప్పటికే న్యాయ విచారణ కోరామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు పాలన చేతకాకపోతే ఆ విషయం చెప్పాలన్నారు. పదేపదే భట్టి అప్పుల గురించి మాట్లాడడం మాని తన శాఖపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.