Hairsh Rao | తెలంగాణ ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయినట్లయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అభ్యర్థికి మద్దతుగా మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలు నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారన్నారు. ఒకసారి మోసపోయారు.. మళ్లీమళ్లీ మోసపోతారా? అని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ వాళ్లు నట్టేట ముంచారన్నారు. డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. ఇప్పటికీ దిక్కలేదని, అప్పు కట్టాలని రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని గుర్తు చేశారు. రూ.2లక్షలు రుణమాఫీ కానివాళ్లు బీఆర్ఎస్కు ఓటెయ్యాలని కోరారు.
ధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ఇవ్వలేదని, పక్కపార్టీ వాళ్ల ఇండ్ల చుట్టు రేవంత్రెడ్డి తిరుగుతున్నడని విమర్శించారు. రేవంత్రెడ్డి రైతులను గాలికి వదిలేసిండని.. వందరోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో చురుకు పెడితేనే కాంగ్రెస్ దారికొస్తుందన్నారు. మేం రైతుబంధు ఇస్తామంటే ఎన్నికల కమిషన్కు కంప్లయింట్ చేసి ఆపిందని.. రైతుబంధు దుక్కికో.. నాటుకో ఉపయోగపడే డబ్బులు పంట కోతకొచ్చినా రైతుబంధు రాలేదన్నారు. రైతుబంధు కోసం మేం ఉంచిన డబ్బులు కాంగ్రెస్ కాంట్రాక్టర్లకు ఇచ్చిందని.. కాంగ్రెస్ పాలనలో కరెంటు మోటర్లు కాలిపోతున్నాయని తెలిపారు. రైతు భరోసా రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడంటే అప్పుడు నీళ్లిచ్చామని.. రెండు పంటలు పండించుకునేలా కేసీఆర్ నీళ్లిచ్చారన్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
కాంగ్రెస్ పాలనలో నీళ్లు తగ్గి కన్నీళ్లు పెరిగినయన్నారు. రూ.4వేలు పెన్షన్ ఇచ్చే వరకు రేవంత్కు అవ్వాతాతల కాళ్లు వత్తాలన్నారు. జనవరి నెల పెన్షన్ రేవంత్ సర్కారు ఎగ్గొట్టిందని.. అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయినట్లయ్యిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుధ్ది చెప్పాలని.. కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ల అబద్ధాలను ఆమోదించినట్లేనన్నారు. ఆడబిడ్డల ఖాతాల్లో ప్రతినెలా రూ.2500 వేస్తామని రేవంత్ మోసం చేశారని.. కాంగ్రెస్ను ఓడిస్తేనే హామీలు అమలు చేస్తారని చెప్పారు. కల్యాణలక్ష్మి లక్షకు తోడు తులం బంగారం ఇస్తానని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.4వేలు ఇస్తామని రేవంత్ మోసం చేశారన్నారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని అసెంబ్లీలో మంత్రి భట్టి అబద్ధాలాడరన్నారు. కేసీఆర్ ఇచ్చిన 30వేల ఉద్యోగాలకు రేవంత్ నియామకపత్రాలు ఇచ్చారన్నారు. చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని మోసం చేశారని.. ఇన్ని మోసాలు చూసినంక కాంగ్రెస్కు ఎవరైనా ఓటేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతిహామీ నెరవేర్చే వరకు వెంటాడుతామన్నారు. దుబ్బాక ప్రజలను బీజేపీ రఘునందన్రావు మోసం చేశారన్నారు. రఘునందన్రావుని దుబ్బాక ప్రజలు బండకేసి కొట్టారన్నారు. పదేళ్లలో సామాన్యులకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్, అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయని.. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని హరీశ్రావు ధ్వజమెత్తారు.