Harish Rao | సిద్దిపేట : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్కు అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ.. యూరియా మీద లేదాయె అని హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
51సార్లు డిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డికి యూరియా ఇచ్చే తెలివి లేదు, ముందుచూపు లేదు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన తెచ్చిండు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్ష చేయకుండా, ఇంతటి దుస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రైతులకు అగ్ర తాంబూలం వేస్తే.. రేవంత్ రైతులను అత:పాతాళంలో పడేశారు. కేసీఆర్ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగాడు… రేవంత్ రెడ్డి యూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నారు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరిగే హక్కు లేదు. ఊర్లలో కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ నేతలను తిరగనివ్వం.. ఎక్కడిక్కడ అడ్డుకుంటాం. వెంటనే రైతులకు యూరియా అందించాలి లేకుంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో యూరియ కొరతతో రైతులు నానా అవస్తలు పడుతున్నారు. రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుంభకర్ణుడిల నిద్రిస్తుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు లైన్ల పెట్టే పరిస్థితి నుండి.. కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పులకు చెక్ పెట్టి రైతుల చెంతకు యూరియా అందించాం. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పెయిల్ అయింది. సగంమంది రైతులకు రుణమాఫీ కాలేదు. వడ్లు అమ్మి మూడు నెలలు అయిన రైతులకు రూ. 1300 కోట్ల బోనస్ డబ్బులు ఇవ్వలేదు. రుణమాఫీ పేరిట రైతులను ఎంతకాలం ఉసూరు పోసుకుంటవ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇచ్చింది ఏంటి అన్ని ఎగ్గొట్టడం తప్ప అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
ఏ ఎన్నికలు పెట్టిన కాంగ్రెస్కు ఆ చేతులే గుణపాఠం చెపుతాయి. అందాల పోటీలకు మీటింగ్లు పెట్టావు కానీ రైతుల కోసం ఎందుకు మీటింగ్లు పెట్టడం లేదు. రేవంత్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి. బడే బాయ్ చోటా బాయ్ కలిసి రైతులకు ఏం న్యాయం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరిగే హక్కు లేదు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కడ అడ్డుకుంటాం. రేవంత్ నోరు విప్పితే కేసీఆర్ను తిట్టుడు తప్ప ఏం లేదు. వెంటనే రైతులకు యూరియా అందించాలి లేకుంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అని హరీశ్రావు హెచ్చరించారు.