Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాల వాటపై సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మాట మాట్లాడుతున్నారని హరీశ్రావు మండిపడ్డారు.
కృష్ణా జలాల విషయంలో పూట పూటకో మాట, ఘడియ ఘడియకో లెక్క ఉందన్నారు. 299 టీఎంసీ కృష్ణా జలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే. చారిత్రక తప్పిదం చేసింది మీరు, తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు మీరు. సమ్మక్క సాగర్ పూర్తి చేసింది బీఆర్ఎస్, డబ్బా ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్. ఒకవైపు చంద్రబాబుకు భయపడి బనకచర్లపై మౌనం వహించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆలమట్టి ఎత్తుపై మౌనం వహిస్తున్నారు.
రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా? కృష్ణా జలాల్లో వాటా విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మల్లా పాత పాటే పాడిండు. ఉత్తర కుమార ప్రగల్భాలే పలికిండు. బేసిన్ల గురించి బేసిక్స్ తెల్వదు, నీళ్ల వాటా గురించి నీళ్లు నములుతారు. కనీస అవగాహన లేని, తెలంగాణ సోయి లేని ఇట్లాంటి దద్దమ్మలు మనకు ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి కావడం మన దౌర్భాగ్యం. ఉత్తం కుమార్ రెడ్డి నిన్న ఏం మాట్లాడిండు.. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేసినం అని గొప్పగ చెప్పిండు. రైట్ షేర్ కోసం నేనే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు చెప్పుకున్నడు అని హరీశ్రావు గుర్తు చేశారు.
మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18.06.2025 నాడు ఏమన్నడు కృష్ణా బేసిన్ మీద 500 టిఎంసీలకు బ్లాంకెట్ ఎన్వోసీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అన్నడు. మొన్న సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి ఏమంటడు.. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటడు. ఉత్తం ఏమో 763 టిఎంసీల రైట్ షేర్ అంటడు, ముఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టీఎంసీ అంటడు. ఓసారి 904 టీఎంసీలు అంటడు. పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నరు. వీళ్ల అజ్ఞానం వల్ల తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా? లేదా నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా? అసలు ఎవరిది కరెక్టు? కనీస అవగాహన లేకుండా ఎట్ల మాట్లాడుతున్నరు. కనీసం ప్రిపరేషన్ లేకుండా ఇలా ఎన్నాళ్లు ఉంటారు అని హరీశ్రావు నిలదీశారు.
కేసీఆర్ కృష్ణా జలాల్లో రైట్ ఫుల్ షేర్ సాధించేందుకు సెక్షన్ 3 కోసం పోరాటం చేసారు. ఉమా భారతి, గడ్కరీ, షకావత్, ప్రధానిలను కలిసారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించారు. 763 టీఎంసీలు అనేది కేసీఆర్ పట్టుబట్టిన విషయం. ఇప్పుడు తామేదో కొత్తగా 763 టీఎంసీలు డిమాండ్ చేసినట్లు.. డబ్బా కొడుతున్నడు ఉత్తం. అదనపు టిఓఆర్ ప్రకారం, మేము కృష్ణా జలాల్లో మొత్తం 935 టీఎంసీల వాటా సాధించేందుకు గ్రౌండ్ తయారు చేసినం. 811 టీఎంసీలు, 195 సర్ ప్లస్ వాటర్ షేర్, 45 టీఎంసీల పోలవరం వాటర్. ఇప్పుడు వీళ్లు ఏం అంటున్నరు 904 టీఎంసీలే మా న్యాయమైన వాటా అంటున్నరు. ఒక బాధ్యత లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు. నీటి ప్రయోజనాల మీద పట్టు లేదు. ద్రోహం చేసినోల్లే సుద్దులు చెబుతున్నారు. 299:512 ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఉత్తం ఏమంటారు.. 512:299 నీటి వాటాను బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిందట. చారిత్రక అన్యాయాన్ని సరి చేస్తున్నరట. ఛీ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. ముఖ్యమంత్రి అంతే, నీళ్ల మంత్రి కూడా అంతే. 299:512 హక్కుల విషయంలో మేం సంతకం పెట్టినం అని నిరూపిస్తే నేను పదవికి రాజీనామా చేస్తా, లేదంటే నువ్వు చేస్తవా ఉత్తం? అని హరీశ్రావు సవాల్ విసిరారు.
కృష్ణాలో 299:512 వాటా ఇచ్చి, తెలంగాణకు తీరని చారిత్రక ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. 18.10.2013 నాడు ఉమ్మడి ఏపీ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇచ్చింది. ఇదే రిపోర్టును శాసనసభలోనూ పెట్టారు. తెలంగాణకు కృష్ణాలో 299, ఏపీకి 512 ఇచ్చినం అని అందులో క్లియర్గా ఉంటుంది. తెలంగాణ ప్రాంత హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. మీ చేతగాని తనం, అడుగులకు మడుగులొత్తడం వల్ల 299 వాటా పరిమితం అయ్యింది. అడ్ హక్కు, ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్ఞానులు రేవంత్ రెడ్డి, ఉత్తంలు. 2015 జున్ 26లో చేసుకున్న అగ్రిమెంట్ తాత్కాలిక ఒప్పందం అని లేఖలో స్పష్టంగా ఉంది. మీ ముద్దుల అడ్వైజర్ ఆదిత్యానాథ్ కూడా సంతకం పెట్టిండు. ఆయనే ఇప్పుడు మీ అడ్వైజర్. కానీ ఉత్తం ఏమంటడు, బిఆర్ఎస్ పెట్టింది అంటడు. జులై 14, 2014 నాడు కృష్ణాలో 299 అన్యాయం అని కేంద్రానికి లేఖ రాసినం. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే.. ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కేంద్రాన్ని కోరామని హరీశ్రావు గుర్తు చేశారు.
తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, నిజాయితీకి నిదర్శనం ఇది. 299ని మేం ఒప్పుకోలేదు. ట్రిబ్యునల్ వేయడంలో ఆలస్యం అవుతుందని మొదటి అపెక్స్ కౌన్సిల్ 2016లో చెప్పినం. రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అడిగితే షకావత్ సుప్రీం కోర్టులో కేసు వాపస్ తీసుకోవాలని చెప్పిండు. అప్పుడు కేసు విత్ డ్రా చేసుకొని, సెక్షన్ 3ని సాధించింది బిఆర్ఎస్. మేం 299 శాశ్వత ఒప్పందం చేసుకుంటే, సెక్షన్ 3 ఎందుకు అడిగాము, అపెక్స్ కౌన్సిల్ ఎందుకు పోయాము, ఎందుకు సుప్రీంకు పోయాము? సెక్షన్ 3పై తెలంగాణ వాదనలు ముగింపు దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో అవగాహన లేకుండా, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తీర్పును ప్రభావితం చేయవా? 17.2.2025 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ లో ఏముంది. అదే తాత్కాలిక ఒప్పందం వీళ్లు కూడా చేసుకున్నరు. దీని గురించి ఏమంటరు ఉత్తం? అందులో ఏముంది ఫైనల్ అవార్డు వచ్చే దాక 50:50 చేసుకుందామని మీ సెక్రెటరీ రాసిండు. అదే డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ 28 లెటర్లు రాసి అడిగింది.299 మేము ఒప్పుకోము అని ఎంత ప్రయత్నం చేసినం. పోరాడినం. ఇన్ని చెప్పాక కూడా 299 కు బిఆర్ఎస్ ఒప్పుకున్నది అని దుష్ర్పచారం చేసే వాళ్లను ఏమనాలో.. వాళ్లే చెప్పాలె అని హరీశ్రావు పేర్కొన్నారు.
సమక్క సాగర్పై డబ్బా ప్రచారం.. సమ్మక్క సారక్క బ్యారేజ్కు మంత్రి ఉత్తమ్ అనుమతులు సాధించినట్టు చెప్పుకుంటున్నడు.
కొండను తవ్వి ఎలుకను పట్టిండు ఉత్తం కుమార్ రెడ్డి. ఛత్తీగఢ్తో కేవలం యాభై ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్ది, దేవాదులను పటిష్టం చేసేందుకు ఏడు టీఎంసీ ల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ను కేసీఆర్ నిర్మించిండు. 83 మీటర్లకు డీపీఆర్ పంపినం. అన్ని డైరెక్టరేట్ల నుంచి అన్ని రకాల అనుమతులు సాధించినం. బ్యారేజీ కట్టినం. నీటిని కూడా లిఫ్టు చేసుకుంటున్నం. కాంగ్రెస్ వచ్చాక ఓ అండ్ ఎం డబ్బులు ఇవ్వక దేవాదులకు నీళ్లు లిఫ్టు చేయకపోతే, బిఆర్ఎస్ నిలదీసింది కూడా. సమ్మక్క బ్యారేజ్కు ఛత్తీస్గఢ్ నుంచి ఒక్క ఎన్వోసీ మినహా అన్ని అనుమతులు బిఆర్ఎస్ హయాంలోనే వచ్చాయి. ప్రాజెక్టులకు అనుమతులు ఆపడంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ సమ్మక్క సాగర్ విషయంలోనూ అదే చేసింది. 2023 ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎన్వోసీ రాకుండా చేసారు అని హరీశ్రావు తెలిపారు.
ఇప్పుడు అక్కడున్న బిజేపీ ప్రభుత్వంతో దోస్తీ కట్టి, 50 ఎకరాలకు ఎన్వోసీ తెచ్చి, మొత్తం ప్రాజెక్టునే కట్టినట్లు బిల్డప్ ఇస్తున్నరు. 50 ఎకరాలపై ఒప్పందం చేసుకుంటేనే కాంగ్రెస్ ఇంత ప్రచారం చేసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు ఎంతో కష్టపడి సాధించిన కేసీఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలి. సమ్మక సాగర్ విషయంలో కాంగ్రెస్ చేసిందేం లేదు. అంతా డంబాచారం, డబ్బా ప్రచారం. ఆల్మట్టి హైట్ పెంపుపై ఎందుకు మౌనం.. తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ కలిసి చేస్తున్న ద్రోహం ఇది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి, బిహార్కు వెళ్లి రాజకీయాలు చేస్తున్నడు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తున్నారు. కేవలం 100 టిఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదు. కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలను ఎడారులుగా మార్చేందుకు కర్నాటక కాంగ్రెస్ పన్నుతున్న కుట్ర ఇది. అక్కడా కాంగ్రెస్సే, ఇక్కడా కాంగ్రెస్సే అయినా మాట్లాడే దమ్ము, తెలంగాణ రైతుల పొట్టగొడుతుంటే ఆపే ధైర్యం లేవా? జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి రైతులను బలిస్తారా? బనకచర్ల రూపంలో కృష్ణా నీళ్లను ఏపీ కొల్లగొడితే మౌనం. ఇప్పుడు కర్ణాటక కొల్లగొడుతుంటే మౌనం. తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ నీళ్ల దోపిడిని అడ్డుకోకపోతే నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదు అని హరీశ్రావు హెచ్చరించారు.