Harish Rao | అబ్దాల పునాదులపై ఏర్పడిందే కాంగ్రెస్ సర్కారు అని.. రాష్ట్రం అప్పుల పాలైందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్దాలను వల్లెవేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. మెదక్లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం దివాళా తీసిందని, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు స్వయంగా సీఎం పదే పదే మాట్లాడటం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమేనన్నారు. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రూ.6.85 లక్షల కోట్ల అప్పుందనే తప్పుడు ప్రచారాన్ని ఇంకెన్నిసార్లు, ఇంకెన్ని రోజులు చేస్తారు రేవంత్ రెడ్డి..? అంటూ నిలదీశారు. పబ్లిక్ మీటింగ్లు, ప్రచార సభల్లో.. 16వ ఆర్థిక సంఘం ముందు, చివరికి ప్రజాపాలన దినోత్సవం వేదికగా కూడా అదే తొండి వాదన వినిపించడంతో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏముంది? అని నిలదీశారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్ర అప్పుల విషయంలో మీరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడుతూ వాస్తవాలు వెల్లడించానని గుర్తు చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమాల కొరకు నెట్గా చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమే అని అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ వివరించానన్నారు.
తెచ్చిన అప్పులను మూలధనంగా మార్చి, ఎన్ని ఆస్తులు సృష్టించామో.. ఎంత సంపద సృష్టించామో లెక్కలతో సహా చెప్పానన్నారు. అయినా రూ.6.85లక్షల కోట్ల అప్పు అంటూ.. దివాళా తీసింది అంటూ.. రాష్ట్రానికి శాపం పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీసిందని ప్రచారం చేయడం సీఎంగా మీకు తగునా? ఇది పాపం కాదా? అంటూ ధ్వజమెత్తారు. కేవలం అప్పుల గురించి మాట్లాడున్నారని.. కానీ 9ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని ఎందుకు చెప్పరు నిలదీశారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న విషయాన్ని ఎందుకు చెప్పరు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని ఎందుకు చెప్పరు? అప్పులను మూలధనంగా మార్చి తెలంగాణకు తరగాని ఆస్తిని సృష్టించామన్న విషయాన్ని ఎందుకు చెప్పరు? ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీసిందన్న మీ మాటలు విని పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా? రాజకీయ కక్షల కోసం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారా? భావి తరాలకు శిక్ష వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విదేశాలకు వెళ్లి ఇక్కడి డొల్ల కంపెనీల్లో బోగస్ పెట్టుబడులు పెట్టినంత సులువు కాదు రాష్ట్ర ప్రతిష్టను కాపాడటం అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మీ బాధ్యత లేని వ్యాఖ్యలతో ఇప్పటికే పలు కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని.. మీ అనాలోచిత చర్యలతో రియల్ ఎస్టేట్ కుదేలైందని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే తెలంగాణ, మీ పాలనలో టాప్ పది స్థానంలో కూడా స్థానం దక్కించుకోలేక పోయిందన్నారు. దీనికి మీ దివాళాకోరు వ్యాఖ్యలు, చేతగాని తనం కారణం కాదా? అంటూ నిలదీశారు. రాజకీయ కక్ష సాధింపు కోసం రాష్ట్ర ప్రయోజనాలను సైతం పణంగా పెట్టే గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడమంటే చిల్లర మల్లర వ్యాఖ్యలు చేయడం, ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం కాదన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని.. రాష్ట్ర ప్రతిష్టను, గౌరవాన్ని మరింత పెంచే విధంగా వ్యవహరించండి అంటూ హితవు పలికారు. ఇది మీకే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు కూడా మంచిదన్నారు. రాష్ట్ర అప్పులపై మీకు అవగాహన కల్పించేందుకు మరోసారి వాస్తవాలను మీకు పంపిస్తున్నానని.. చదువుకొని, అధికారులతో సమీక్షించుకోవాలని కోరారు. దయచేసి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చిత్రీకరించవద్దని, ప్రతిష్ఠ దిగజార్చవద్దని తెలంగాణ ప్రజల పక్షాన కోరుతున్నానన్నారు.