Harish Rao | వడ్లకు బోనస్ ఏమైందని అడిగితే.. వ్యవసాయ మంత్రి కొందరు మొరుగుతున్నారంటూ రైతులను కుక్కలతో పోలుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు బాండ్ పేపర్పై రాసిచ్చి.. వడ్లకు బోనస్ ఇస్తామని ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామని ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్పై సంతకాలు పెట్టారు కదా? ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు, భట్టి విక్రమార్క సంతకాలు
పెట్టారు. మీరు సంతకాలు పెట్టి.. నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి.. చేతుల్లో పట్టుకొని ఇవాళ వడ్లకు బోనస్ ఏమందంటే చేతులెత్తేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఎందుకు ఇవ్వరు బోనస్? ఇవాళ జగిత్యాల జిల్లాలో రైతులతో, వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడితే జిల్లా పరిధిలో 2.97లక్షల ఎకరాల్లో యాసంగిలో వడ్ల పండితే.. 2.80లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లే ఉన్నయ్. మిగితా 17వేల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. అవి కూడా ఇంటిమందం సన్నాలు తిండిగింజల కోసం సాగు చేశారు. దానికి మీరు బోనస్ ఇచ్చేది ఏందీ? లక్ష్మారెడ్డి అనే రైతుతో మాట్లాడితే మా జగిత్యాలలో జైశ్రీరామ్ అనే సన్నవడ్లకు బయట రూ.2800-రూ.3వేలు కొనుగోలు చేస్తున్నరు. గవర్నమెంట్ ఇచ్చేది
ఏందీ? ప్రైవేటులోనే కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల రూ.500 కోసం ప్రభుత్వానికి అమ్మనే అమ్మరు. ఇదంతా మోసం ఉన్నది అని రైతు లక్ష్మారెడ్డి చెబుతూ వాపోతున్నరు. వాస్తవానికి దొడ్డు రకమైతే 25-30 క్వింటాళ్లు పండుతయ్. సన్న రకాలైతే 10-15 క్వింటాళ్లు పండుతయ్. దాదాపు పది క్వింటాళ్ల వరకు దిగుబడి తక్కువ. రోగాలు, పెట్టుబడి, నెలరోజుల కాలం ఎక్కువ. మన ప్రాంతంలో రైతులు పండించేది రూపాయికి 90 పైసలు దొడ్డు రకమే ఎక్కువ. మరి సన్నాలకు బోనస్ ఇస్తామంటే.. రైతులను మోసం
చేయడం, దగా చేయడం.. రైతులను గుండెలపై తన్నడం తప్ప ఇంకోటి లేదు’ అన్నారు.
‘బాధ కలిగించే విషయం ఏంటంటే వ్యవసాయశాఖ మంత్రి అంటరు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని కొందరు మొరుగుతున్నరు అంటున్నరు. మరి రైతులు కూడా మొరుగుతున్నట్టేనా? ఈ రైతులే చెబుతున్నరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేస్తున్నది. అంటే ఇవాళ రైతులను అవమానపరుస్తున్నారు. మీరిచ్చిన మాట అమలు చేయండంటే.. మొరుగుతున్నరు అని మాట్లాడుతున్నరి అంటున్నరు.. రైతులను కుక్కలు అంటున్నరా? మీరు. ఒక మంత్రి ఏమో రైతుబంధు ఎప్పుడు ఇస్తరు అంటే చెప్పుతో కొడుతా అంటడు. అయ్యా వడ్లకు ఎప్పుడు బోనస్ ఇస్తరు.. ఇది మోసం అంటే.. రైతులను పట్టుకొని కుక్కలతో
పోలుస్తూ మొరుగుతున్నరు అంటున్నరు. మిమ్మల్ని ఇందుకేనా గెలిపించింది ? అంటూ నిలదీశారు.
‘రైతులందరూ ముక్తకంఠంతో చెబుతున్నరు. మేమందరం హైదరాబాద్కు వస్తాం. పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నరు. దీనిపై స్పందించాలి. ఇప్పుడు ఏం అంటున్నరు ? ఇప్పుడు మెల్లగా భవిష్యత్లో కొంటాం అంటున్నరు. ఎన్నికలకు ముందు బాండ్పేపర్పై ఏమని రాసిచ్చారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఏమైందంటే దాటవేస్తున్నరు. ఇది మోసపూరిత ప్రభుత్వం. మొన్న లోక్సభ ఎన్నికల సమయంలో డబ్బాలో ఓటుపడేదాక ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు సన్నాలకే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రైతులను మోసం చేస్తున్నరు. మంత్రులు మేల్కొనాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి’ అని
డిమాండ్ చేశారు.