Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల్లోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్రావు విమర్శించారు. ‘ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు రేవంత్రెడ్డి.. చీకటి జీవోల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చేయి’ అని రేవంత్రెడ్డిని డిమాండ్చేశారు.
ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. జీవోలు దాస్తూ చేస్తున్న డ్రామా.. సమాచార హక్కు చట్టం ద్వారా రాబట్టిన సమాధానం ఆధారంగా తమ పార్టీ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)తో బట్టబయలైందని మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సీఎంగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టిన 2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 26 వరకు 13 నెలల్లో 19,064 జీవోలు జారీ చేయగా, వాటిలో కేవలం 3,290 జీవోలను మాత్రమే పబ్లిక్ డొమెయిన్లో ఉంచడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. ‘ఒక ఏడాదిలో 15,774 జీవోలు అంటే 82 శాతం దాచి పెట్టి ప్రభుత్వం ఏంచేస్తున్నట్టు? రేవంత్రెడ్డి ఇదేనా మీరు చెప్పిన ప్రజా ప్రభుత్వం?’ అని నిలదీశారు.